
IND Playing XI vs SL 2nd Test: గాలె మైదానంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 23 నుంచి కొలంబోలో ఆరంభం కానుంది. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని గిల్ సేన భావిస్తోంది. తొలి టెస్టులో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 10 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో రెండో టెస్టు తుది జట్టులో అతడు కొనసాగనున్నాడు. అయితే భారత్ తుది జట్టులో ఓ కీలక మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది.
తొలి టెస్టులో భారత్కు బ్యాటింగ్, బౌలింగ్లో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. అయినప్పటికీ కెప్టెన్ శుభ్మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒక మార్పు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో 33 ఏళ్ల దేశవాళీ కింగ్ సారంశ్ జైన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన సారంశ్.. దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రైట్ ఆర్మ్ బ్యాటింగ్తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగల సారంశ్.. జట్టుకు అదనపు బ్యాటింగ్ బలం కూడా కానున్నాడు. తొలి టెస్టులో కుల్దీప్ 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చాడు. మరోవైపు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్స్ పడగొట్టారు.
కుల్దీప్ యాదవ్ స్థానంలో సారంశ్ జైన్ను తీసుకుంటే.. శ్రీలంక బ్యాటర్లపై స్పిన్తో ఒత్తిడి పెంచడంతో పాటు బ్యాటింగ్ విభాగంలోనూ భారత్కు అదనపు బలం దక్కనుంది. సారంశ్ అరంగేట్రం చేస్తే.. ఓ రికార్డు నెలకొల్పనున్నాడు. లేటు వయసులో టీమిండియాకు అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో నిలుస్తాడు. దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్లో సారంశ్ 181 వికెట్లు, 2223 పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్, సెంట్రల్ జోన్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సారంశ్.. 12 ఏళ్ల పాటు దేశవాళీ క్రికెట్లో రాణించాడు. ఎట్టకేలకు ఇప్పుడు భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఇక తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.
వికెట్ కీపర్-బ్యాటర్ ధ్రువ్ జురెల్ తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీతో రాణించిన జురెల్కు మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. పేస్ విభాగంలోనూ పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తొలి టెస్టులో మంచి ప్రదర్శన చేయడంతో వారిని కొనసాగించే అవకాశాలే ఉన్నాయి. గర్నూర్ బ్రార్కు అవకాశం ఇవ్వాలనే చర్చ ఉన్నప్పటికీ.. కీలకమైన రెండో టెస్టులో పేస్ బౌలింగ్ కాంబినేషన్ను మార్చడం అనవసరమైన రిస్క్గా టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందట.
టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, సారంశ్ జైన్/కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.