Reading Time: 2 minutes
Watch: అమ్మాయి చేతిలో ఫోన్.. రైలు కిటికీ బయట దొంగ..! క్షణాల్లో జరిగిన షాకింగ్ సీన్!

రైలు ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలు కిటికీ దగ్గర కూర్చుని ఫోన్‌ ఉపయోగిస్తున్న ఓ చిన్నారి చేతిలో నుంచి బయట ఉన్న వ్యక్తి ఫోన్‌ను లాక్కెళ్లిపోయాడు. సోషల్ మీడియా Xలో షేర్‌ అయిన ఈ వీడియోకు వేలాది వ్యూస్‌ రావడంతో ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ విస్తృతంగా షేర్ అవుతోంది.

వైరల్ వీడియోలో ఇద్దరు చిన్నారులు రైలులో ప్రయాణిస్తున్నారు. కిటికీ పక్కన కూర్చుని తమ మొబైళ్లను ఉపయోగిస్తున్నారు. ఇంతలో రైలు బయట ఉన్న ఓ వ్యక్తి కిటికీ వద్దకు వచ్చి.. ఓ బాలిక చేతిలోని ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఆమె తన ఫోన్‌ను గట్టిగా పట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కొద్దిసేపు ఇద్దరి మధ్య ఫోన్ కోసం గట్టి ప్రయత్నం జరుగుతుంది. చివరకు ఆ వ్యక్తి ఫోన్‌ను బలవంతంగా లాక్కుని అక్కడి నుంచి పారిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఫోన్ పోవడంతో చిన్నారి తీవ్ర ఆవేదనకు గురై ఏడుస్తున్నట్లు వీడియోలో కనిపించింది. పక్కనే ఉన్న మరో బాలిక కూడా షాక్‌కు గురైంది. అయితే ఈ ఘటన సమయంలో అక్కడున్న ఇతర ప్రయాణికులు వెంటనే స్పందించలేదన్న విషయంపై నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. వీడియో తీస్తున్న వ్యక్తి కూడా బాధితురాలికి సహాయం చేయకుండా ఘటనను రికార్డు చేయడంపైనే దృష్టి పెట్టాడని పలువురు విమర్శిస్తున్నారు.

అయితే ఈ వీడియోపై మరో కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఇది నిజంగా జరిగిన ఘటన కాదని, ముందుగా ప్లాన్ చేసి చిత్రీకరించిన వీడియో కావచ్చని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీడియో తీస్తున్న వ్యక్తికి ఫోన్ లాక్కెళ్లే విషయం ముందే ఎలా తెలిసిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వీడియో నిజమైనదా, లేక స్క్రిప్టెడ్‌ వీడియోనా అన్నది స్వతంత్రంగా నిర్ధారించలేము. ఏదేమైనా రైలు ప్రయాణికులు కిటికీ దగ్గర మొబైల్ ఫోన్లు ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ వీడియో మరోసారి గుర్తుచేస్తోంది. ముఖ్యంగా కిటికీ బయటకు ఫోన్ కనిపించేలా పట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు సూచిస్తున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..