Reading Time: 2 minutes
Supreme Court Forms 5 Member Panel To Probe Jantar Mantar Police Action

Supreme Court: జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలు, నిరసనకారులపై హింస, మహిళా నిరసనకారులపై వేధింపులు, బలప్రయోగానికి సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదికలు సమర్పించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని (HPEC) ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌ రెడ్డిని కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించింది. పంజాబ్‌, హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రవిశంకర్‌ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శాలిందర్‌ కౌర్‌, మాజీ సీబీఐ డైరెక్టర్‌ రిషి కుమార్‌ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ డాక్టర్‌ ఎల్‌.ఆర్‌. బిష్ణోయ్‌ కమిటీ సభ్యులుగా ఉంటారు.

మహిళా నిరసనకారులపై ఆరోపణలపై ప్రత్యేక దృష్టి
జంతర్‌ మంతర్‌ నిరసనల సందర్భంగా మహిళా నిరసనకారులపై లక్షిత హింస, వేధింపులు, లైంగిక దాడులకు సంబంధించిన ఆరోపణలను కమిటీ ప్రత్యేకంగా పరిశీలించనుంది. ఈ అంశం అత్యంత సున్నితమైనదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. నిరసనల్లో పాల్గొన్న ప్రజలపై పోలీసులు, భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపైనా కమిటీ విచారణ చేపట్టనుంది. పోలీసుల చర్యల వల్ల నిరసనకారులకు తీవ్ర గాయాలు, నష్టం వాటిల్లిందన్న ఆరోపణలను పరిశీలించనుంది.

పోలీసుల బలప్రయోగంపైనా విచారణ
నిరసనల సమయంలో పోలీసులు బలప్రయోగం చేసిన తీరుపై కూడా కమిటీ దృష్టి సారించనుంది. ప్రస్తుత చట్టాలు, నిబంధనలు, నిర్దేశిత ప్రమాణాలను ఉల్లంఘించి బలప్రయోగం జరిగిందా? ఒకవేళ ఉల్లంఘనలు జరిగితే అందుకు ఎవరు బాధ్యులు? అనే అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. కేవలం సంఘటనా స్థలంలో జరిగిన ఘటనలకే దర్యాప్తును పరిమితం చేయకుండా.. పోలీసుల చర్యలకు సంబంధించిన నిర్ణయ ప్రక్రియ, అధికారుల బాధ్యత, అధికార శ్రేణి వంటి అంశాలను కూడా కమిటీ పరిశీలించనుంది.

ఒక్కసారి చేసే విచారణ కాదు
ఈ కమిటీ దర్యాప్తు ఒక్కసారి జరిగే ప్రక్రియ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంశాలపై నిరంతరం, క్రమానుగతంగా మదింపు నిర్వహించాలని ఆదేశించింది. దర్యాప్తు పురోగతిపై ఎప్పటికప్పుడు మధ్యంతర నివేదికలను సుప్రీంకోర్టుకు సమర్పించాలని కమిటీకి సూచించింది. కమిటీ సభ్యుల అనుభవం, నైపుణ్యం, వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని హెచ్‌పీఈసీని ఏర్పాటు చేసినట్లు కోర్టు పేర్కొంది. కమిటీ సమర్పించే సిఫార్సులను సీరియస్‌గా పరిగణిస్తామని స్పష్టం చేసింది.

గాయపడిన వారికి పరిహారంపైనా పరిశీలన
నిరసనల సందర్భంగా గాయపడిన వారికి మధ్యంతర పరిహారం అందించే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించనుంది. గాయపడిన నిరసనకారులతో పాటు గాయపడిన పోలీసు అధికారులకు కూడా మధ్యంతర పరిహారం అందించాల్సిన అవసరం ఉందా? అనే అంశాన్ని అంచనా వేయాలని కోర్టు సూచించింది. కమిటీ దర్యాప్తు ఆధారంగా మధ్యంతర నివేదికలను సమర్పించిన తర్వాత.. వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవడం, తదుపరి ఆదేశాలు జారీ చేయడంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. దీంతో జంతర్‌ మంతర్‌ నిరసనల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన హింస, పోలీసుల బలప్రయోగం, మహిళా నిరసనకారులపై వేధింపుల అంశాలపై సమగ్ర విచారణకు మార్గం సుగమమైంది.