
అమెరికా అంటే ఆహా ఓహో అనుకుంటాం గానీ…. పైన పటారం.. లోన లొటారంలా తయారవుతుంది ఆ దేశం పరిస్థితి. ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో పాటు ఆదేశాన్ని వెంటాడుతున్న అనేక సమస్యలు అగ్రరాజ్యం తళుకులను క్రమంగా ఫేడ్ అవుట్ చేస్తున్నాయి. అమెరికా జాతీయ అప్పు రికార్డు స్థాయిలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అప్పుల భారం అమెరికాను ప్రత్యక్షంగా.. ప్రపంచాన్ని పరోక్షంగా కుదిపేయబోతోంది.
అప్పులు చేయకుండా… చేతులు చాచకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ నడవదు. ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఇదే రూల్. అగ్రరాజ్యం అమెరికా కూడా దీనికి మినహాయింపేమీ కాదు. వరల్డ్ సూపర్ పవర్ అని చెప్పుకోవాడనికి బాగుంటుంది గానీ… అమెరికా ఆర్థిక పరిస్థితి చూస్తే ఆ దేశ ఎకానమీలో ఉన్న డొల్లతనం బయటపడుతుంది. ఈ మధ్య కాలంలో అమెరికా అప్పుల భారం ఊహించని స్థాయిలో వేగంగా పెరుగుతుంది. కేవలం గత ఐదు నెలల్లోనే జాతీయ అప్పు వన్ ట్రిలియన్ డాలర్లు పెరిగింది. ప్రస్తుతం ఇదే తీరు కొనసాగితే ఆరేళ్లలో ఈ అప్పు 50 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పీటర్ జి. పీటర్సన్ ఫౌండేషన్ హెచ్చరించింది. పదేళ్ల క్రితం ఈ అప్పు 20 ట్రిలియన్ డాలర్ల కంటే తక్కువే ఉండేది. 2023 మే లో కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా ప్రకారం 2028 నాటికి 40 ట్రిలియన్ల మార్కును దాటుతుందని భావిస్తున్నారు. అయితే అనుకున్న దానికంటే ముందే ఈ గండం ముంచుకొచ్చింది.
ఇంత భారీగా అప్పులు పెరగడానికి ప్రధాన కారణం వృద్ధాప్య జనాభా సమస్య. ప్రతిరోజూ దాదాపు 10 వేల మంది బేబీ బూమర్స్ పదవీ విరమణ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్ల ఆయుర్దాయం కూడా పెరిగింది. దీంతో సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ కోసం ఫెడరల్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది. దీనికి తోడు గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఆమోదించిన పన్నుల కోత, వ్యయ పెంపు బిల్లులు కూడా రుణ భారాన్ని పెంచాయి. 2017 నాటి టాక్స్ కట్స్ యాక్ట్ తో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో 2025లో వచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ ఆర్థిక భారాన్ని పెంచాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇచ్చిన రిలీఫ్ ఫండ్స్ కూడా అప్పులు పెరగడానికి కారణమయ్యాయి.
పెరుగుతున్న వడ్డీ రేట్లు, అప్పుల కారణంగా ఫెడరల్ ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మహమ్మారి కాలం నాటి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు 1 ట్రిలియన్ డాలర్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఐదేళ్లలో ఈ ఖర్చులు మూడింతలు పెరిగాయి. దేశ రక్షణ రంగంపై పెట్టే ఖర్చు కంటే వడ్డీలకే అమెరికా ఎక్కువ వెచ్చిస్తోంది. పిల్లల కార్యక్రమాలపై పెట్టే ఖర్చు కంటే ఇది 50 శాతం ఎక్కువ. గడిచిన 10 నెలల్లోనే ప్రభుత్వం 1.8 ట్రిలియన్ డాలర్ల లోటును నమోదు చేసింది.
ఈ జాతీయ అప్పు.. బాండ్ మార్కెట్ పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. 30-ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 2007 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది. ఈల్డ్స్ పెరగడం వల్ల రుణాల వడ్డీ రేట్లు కఠినతరం అవుతాయి. ఇది వినియోగదారులపై భారం మోపుతుంది. 2025లో మూడీస్ సంస్థ అమెరికా అప్పుల రేటింగ్ ను డౌన్ గ్రేడ్ చేసింది. అత్యుత్తమ క్రెడిట్ రేటింగ్ ను అమెరికా కోల్పోయింది. అయినప్పటికీ ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాల కంటే ఒక మెట్టు పైనే ఉంది. గతేడాది రిపబ్లికన్లు అప్పుల పరిమితిని 5 ట్రిలియన్ డాలర్లు పెంచారు.
ఇతర దేశాలను కంట్రోల్ చేసే ఆలోచనలను మానుకుని అమెరికా ఇప్పటికైనా సొంత దేశాన్ని… ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునే ఆలోచనలు మొదలు పెట్టాలి. లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా చితికి పోయే ప్రమాదం ఎంతో దూరంలో లేదనే చెప్పాలి.