Reading Time: 2 minutes

అమ్మే నా జీవితానికి అతిపెద్ద పిల్లర్.. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ షాకింగ్ కామెంట్స్!

Caption of Image.

కోలీవుడ్ దళపతి, తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. నటన వైపు కాకుండా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నారు.  సందీప్ కిషన్ హీరోగా ‘లైకా ప్రొడక్షన్స్’ నిర్మాణంలో తెరకెక్కించిన హైవోల్టేజ్ యాక్షన్ అండ్వెంచర్ ‘సిగ్మా’తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు.  

అమ్మే నా జీవితానికి అతిపెద్ద పిల్లర్!

లేటెస్ట్ గా జేసన్ సంజయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించే కాకుండా.. తన కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన తల్లి సంగీత గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.  నా జీవితంలో అమ్మే అతిపెద్ద పిల్లర్. ఆమె 24 గంటలూ నా గురించి, నా సోదరి గురించే ఆలోచిస్తుంది. నేను ఒక్కరోజు ఫోన్ చేయడం మర్చిపోయినా.. వెంటనే ఫోన్ చేసి ఏం జరిగింది? బాగున్నావా? అని అడుగుతుంది అంటూ అమ్మతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు.

అయితే తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోలేనని జేసన్ చెప్పారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తనకు ఆ స్థాయిలో ఫ్రీ స్పేస్ ఇవ్వలేదన్నారు. అందుకే కొన్ని విషయాలు చెప్పేందుకు కొంత సంకోచిస్తానని తెలిపారు. కానీ తన సోదరితో మాత్రం ఏ విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడగలనని, ఆమెనే తన బెస్ట్ కాన్ఫిడెంట్ అని వెల్లడించారు.

నాన్నపై అంతులేని గర్వం..

తండ్రి విజయ్ గురించి కూడా జేసన్ ఆసక్తికర విషయాలు చెప్పారు. తన తండ్రి స్వయంకృషితో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు.  ఆయన గురించి తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.. తన కెరీర్‌లోనూ ఇతరుల ప్రభావానికి లోనుకాకుండా సొంతంగా కష్టపడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని విజయ్ తనకు సూచించినట్లు జేసన్ వెల్లడించారు. ఇదే జేసన్ కెరీర్‌లో కూడా కనిపిస్తోంది. తండ్రి లాంటి స్టార్ హీరోగా తెరపైకి రావడం కంటే.. కెమెరా వెనుక దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నారు.

 

జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘సిగ్మా’లో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంపత్, రాజు సుందరం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ముందుగా నిర్ణయించిన రిలీజ్ షెడ్యూల్ నుంచి వాయిదా పడగా.. ప్రస్తుతం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

 

©️ VIL Media Pvt Ltd.