Reading Time: 2 minutes
India Singapore Sign Mous Food Safety Advanced Manufacturing Digitalisation

భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. రెండు దేశాలు గురువారం రెండు అవగాహన ఒప్పందాలు, ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పరస్పరం మార్చుకున్నాయి. ముఖ్యంగా ఆహార భద్రత, సముద్ర వారసత్వం, టెలికమ్యూనికేషన్స్, ప్రసార నియంత్రణ వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకునేందుకు ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయి. అలాగే అధునాతన తయారీ, డిజిటలైజేషన్ తదితర రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

సింగపూర్‌లో ఆగస్టు 20న జరిగిన నాలుగో ఇండియా-సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, ఎలక్ట్రానిక్స్-ఐటీ, వాణిజ్య-పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆరు కీలక రంగాలపై చర్చ

నాలుగో ISMRలో ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఆరు ప్రధాన రంగాలపై చర్చించారు. అధునాతన తయారీ, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, ఆరోగ్యం-వైద్యం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరత వంటి అంశాల్లో ఇప్పటికే జరుగుతున్న సహకారాన్ని సమీక్షించడంతో పాటు కొత్త అవకాశాలను అన్వేషించారు.

భారత్-సింగపూర్ భాగస్వామ్యంలో మంచి ఊపు కొనసాగుతోందని, దీనిని మరింత స్పష్టమైన ఫలితాలుగా మార్చేందుకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్చలు సాగినట్లు పేర్కొంది.

మూడు ఒప్పందాలు.. ఏ రంగాల్లో అంటే?

నాలుగో ISMR సందర్భంగా భారత్, సింగపూర్ మధ్య రెండు MoUs, ఒక LoIను పరస్పరం మార్చుకున్నారు. వీటిలో సముద్ర వారసత్వం (Maritime Heritage) రంగంలో సహకారం,
ఆహార భద్రత (Food Safety) రంగంలో సహకారం, టెలికమ్యూనికేషన్స్, ప్రసార నియంత్రణలు వంటి అంశాల్లో సహకారం ఉన్నాయి. ఈ ఒప్పందాలతో ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో సహకారం మరింత విస్తరించనుంది.

ISMR సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సింగపూర్ రవాణా మంత్రి, రెండో ఆర్థిక మంత్రి జెఫ్రీ సియోతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలతో పాటు ఆర్థిక, ఆర్థిక వ్యవహారాల సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. సింగపూర్ తరఫున ఉప ప్రధాని, వాణిజ్య-పరిశ్రమల మంత్రి గాన్ కిమ్ యోంగ్ నేతృత్వం వహించారు. సీనియర్ మంత్రి, జాతీయ భద్రత సమన్వయ మంత్రి కె. షణ్ముగం, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, డిజిటల్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి జోసెఫిన్ టియో, రవాణా మంత్రి, రెండో ఆర్థిక మంత్రి జెఫ్రీ సియో కూడా సమావేశంలో పాల్గొన్నారు.

భారత్-సింగపూర్ మధ్య ఇప్పటికే ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు.. అధునాతన తయారీ, డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరత వంటి రంగాల్లో భవిష్యత్ సహకారానికి ఈ సమావేశం కీలక వేదికగా నిలిచింది.