
శ్రావణ మాసం వచ్చేసింది. హిందూవులు పవిత్రంగా భావించే మాసం ఇది. ప్రత్యేకంగా మహిళలకు ఈ మాసం ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. తమ కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వ్రతం పాటిస్తూ ఉంటారు. భక్తిశ్రద్దలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ మాసంలో నాజ్ వెజ్ తినడం మానేయడం, ఉపవాసాలు పాటించడం లాంటివి సాధారణంగా చేస్తూ ఉంటారు. అయితే శ్రావణ మాసం రావడంతో పూజా సామాగ్రి ధరలు భారీగా పెరిగాయి. కొబ్బరికాయలు, పూలు, తమలపాకు, అరటిపళ్లు వంటి వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
కొబ్బరికాయ ఎంతంటే..?
కొబ్బరికాయ ధర మొన్నటివరకు సైజుని బట్టి రూ.15 నుంచి రూ.35 మధ్య లభించగా.. ఇప్పుడు రూ.50 వరకు పలుకుతోంది. మీడియం సైజు కొట్టరికాయను రూ.50కు మార్కెట్లో విక్రయిస్తున్నారు. గతంలో డజన్ అరటిపళ్లు రూ.40 నుంచి రూ.60 మధ్య దొరకగా.. ఇప్పుడు రూ.80 వరకు చేరుకున్నాయి. కొన్నిచోట్ల రూ.100కి కూడా వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఇక తమలపాకు ధరలు కూడా భారీగా పెరిగాయి. 30 ఆకుల తమలపాకులు రూ.50 పలుకుతున్నాయి. రైతుల వద్ద 150 ఆకుల కట్టను రూ.16కే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. ప్రజల వద్ద నుంచి ఒక్కొ తమలపాకుకు రూ.1 వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 ఆకులకు రూ.50 చొప్పున చెల్లించాల్సి వస్తోంది.
పెరిగిన గులాబీలు, బంతి పూల ధరలు
ఇక చిట్టి గులాబీలు, చామంతులు, బంతి పూల ధరలు కూడా పెరిగాయి. చిట్టి గులాబీలు గతంలో రూ.200లోపే ఉండగా.. ఇప్పుడు రూ.400 వరకు పలుకుతున్నాయి. ఇక చామంతులు గతంలో రూ.150గా ఉండగా.. ఇప్పుడు రూ.350కి విక్రయిస్తున్నారు. బంతి పూల విషయానికొస్తే గతంలో రూ.30గా ఉండగా.. ఇప్పుడు రూ.70కి చేరుకున్నాయి. ఇలా పూజల కోసం ఉపయోగించే సామాగ్రి ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలతో సామాన్యులకు భారం మారాయి. ఒకేసారి రేట్లు డబుల్ అవ్వడంతో తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎల్నీవో ప్రభావంతో వర్షాలు సరిగ్గా పడటం లేదు. దీంతో పూల సాగు కూడా తగ్గిపోయింది. కాల్వలు, బోర్ల కింద కొంతమంది పండిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండగా.. సరఫరా తక్కువగా ఉండటంతో ధరలు పెరుగుతున్నాయి. శ్రావణ మాసం పూర్తయ్యేంత వరకు ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మరింతగా పెరుగుతాయి తప్ప తగ్గే ఛాన్స్ లేదని చెబుతున్నారు. అయితే పెరిగిన ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి.