Reading Time: 2 minutes
Vijays Son Jason Sanjay Acting Debut Opens Up About Hero Plans After Sigma

Jason Sanjay: తమిళ స్టార్, ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన తలపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’తో ఆయన తన దర్శకత్వ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే అభిమానుల్లో మరో పెద్ద ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. విజయ్ వారసుడిగా జాసన్ కూడా త్వరలో హీరోగా తెరపై కనిపిస్తాడా? ఈ ప్రశ్నకు ఇప్పుడు ఆయనే తొలిసారి ఆసక్తికరమైన సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సిగ్మా’ విడుదలయ్యే వరకు తన పూర్తి దృష్టి దర్శకత్వం పైనే ఉంటుందని జాసన్ సంజయ్ స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో నటనకు పూర్తిగా తలుపులు మూయలేదని కూడా వెల్లడించారు. మంచి కథ, ఆసక్తికరమైన అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాసన్ సంజయ్.. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం ‘సిగ్మా’పైనే ఉంది. ఈ సినిమా నాకు చాలా ముఖ్యమైనది. ఈ మూవీ రిలీజ్ తర్వాత సరైన అవకాశం వస్తే నటిస్తానని అన్నారు. అంతేకాదు ఒకవేళ హీరోగా అరంగేట్రం చేస్తే మొదట రొమాంటిక్ కామెడీ తరహా సినిమాకే ప్రిఫరెన్స్ ఇస్తానని, తర్వాత తనకు ఎంతో ఇష్టమైన సైన్స్ ఫిక్షన్ జానర్‌లో కూడా నటించాలని ఉందని వెల్లడించారు. జాసన్ ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన పూర్తిగా దర్శకత్వంపైనే దృష్టి పెట్టినట్లు భావించారు. కానీ ఇప్పుడు నటనపై కూడా ఆసక్తి ఉందని చెప్పడంతో విజయ్ అభిమానులు ఆయనను వెండితెరపై చూసే రోజు దగ్గర్లోనే ఉంటుందేమో అనే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘సిగ్మా’ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. జాసన్ సంజయ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ యాక్షన్, అడ్వెంచర్, హీస్ట్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందుతోంది. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా కనిపించనున్నారు. రాజు సుందరం, సంపత్ రాజ్, యోగ్ జాపీ, అన్బు థాసన్, కిరణ్ కొండ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్యాథరిన్ త్రెసా కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

వాస్తవానికి ‘సిగ్మా’ను 2026 జూలై 31న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, తర్వాత రిలీజ్ డేట్ ను మార్చి 2026 అక్టోబర్ 2కు వాయిదా వేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘ఓలమ్మో వగలాడి’ వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు తలపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత నటుడిగా ఆయన చివరి సినిమా ‘జన నాయగన్’గా నిలిచింది. ఇప్పుడు ఆయన సినీ ప్రయాణం ముగిసిన తరుణంలో, కుమారుడు జాసన్ సంజయ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

దర్శకుడిగా తొలి అడుగు వేస్తూనే, భవిష్యత్తులో నటుడిగానూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని జాసన్ చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. మరి ‘సిగ్మా’తో దర్శకుడిగా విజయాన్ని అందుకున్న తర్వాత ఆయన నిజంగానే హీరోగా అరంగేట్రం చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.