Reading Time: 3 minutes
Super El Nino 2026 India Monsoon Crops Weather Warning

ఏ కాలంలో ఏం జరగాలో అన్ని సంక్రమంగా జరిగితే మానవ మనుగడ సుఖంగా ఉంటుంది. లేదంటే మానవ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు అలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతున్నా.. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో దేశంలో ఎక్కడా వర్షాలు కురవలేదు. నామమాత్రంగా కొన్ని రాష్ట్రాల్లో అక్కడడక్కడ వర్షాలు కురిసినా ప్రయోజనం అంతగా కనిపించలేదు. చెరువులు, నదులు, కుంటలు ఎక్కడా నిండుకోలేదు. దీంతో ఈ ఏడాది వ్యవసాయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనింతటికి సూపర్ ఎల్‌నినోనే కారణంగా సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. ఎల్‌నినో కారణంగా ఏడాది పాటు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

శాస్త్రవేత్తల హెచ్చరికలతో ఇప్పటికే దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. వ్యవసాయదారులకు ఎలాంటి పంటలు వేయొద్దని సూచించాయి. కేవలం కూరగాయల సాగు మాత్రమే చేయాలని అన్నదాతలకు సూచించాయి. దీంతో ఇప్పటికే ఆయా ధరలు కొండెక్కాయి. నిత్యవసర వస్తువుల ధరలన్నీ మండిపోతున్నాయి. చక్కెర ధర అయితే రూ.65కి పెరిగింది. దేశంలో నిల్వలు కూడా తగ్గిపోయాయి. ఇక ఉల్లిపాయలు కిలో రూ.60కి పైగా అమ్ముతున్నారు. ఇలా వంటింటికి సంబంధించిన ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.

ఇక దేశంలో రుతుపవనాలు బలహీనపడ్డాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో పూర్తిగా పంటలు ప్రమాదంలో పడినట్లుగానే కనిపిస్తోంది. ఈ ఏడాది 100 ఏళ్ల నాటి రికార్డ్ బద్దలు అవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ కారణంగా రబీ, ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా 2027 రికార్డు స్థాయిలో అత్యంత వేడి సంవత్సరంగా మారవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే ఐరోపా దేశాలు అల్లాడిపోతున్నాయి. తీవ్రమైన వేడి కారణంగా ఉక్కపోతతో బెంబేలెత్తిపోతున్నారు. వర్షాలు లేక పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఇలా ప్రపంచ దేశాలన్నీ ఒక ఏడాది పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

విలన్‌గా ఎల్‌నినో..

వర్షాలకు ఎల్‌నినో విలన్‌గా మారింది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రుతుపవనాలను నీరుగార్చే ఈ ఎల్‌నినో ఒక శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైనదిగా మారబోతోందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వాస్తవానికి నవంబరులో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసినప్పటికీ.. ఇది ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇది భారతదేశంలోని పంటలకు పెద్ద ముప్పును కలిగించవచ్చని చెబుతున్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో పసిఫిక్ మహాసముద్రంలో ఒక శక్తివంతమైన ఎల్ నినో ఏర్పడుతోందని.. ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని యూకే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశంలో రుతుపవనాలు బలహీనంగా ఉండటం పంటల సాగుకు, ఉత్పాదకతకు శుభవార్త కాదని వాతావరణ శాస్త్రవేత్త సురేంద్ర సింగ్ అంటున్నారు. పంట చక్రం కూడా ప్రభావితం కావచ్చని చెబుతున్నారు.

రికార్డు బద్దలయ్యే అవకాశం

ఎల్‌నినో ప్రభావం కారణంగా పసిఫిక్ మహాసముద్రం 3.9 డిగ్రీల వరకు వేడెక్కవచ్చని యూకే వాతావరణ కార్యాలయం చెబుతోంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలో రెండు డిగ్రీల పెరుగుదల కూడా ఒక పెద్ద సంఘటనగా పరిగణించబడుతుందని యూకే వాతావరణ శాఖ అధికారి ఆడమ్ స్కాఫెన్ అంటున్నారు. 2015-16లో ఎల్‌నినో కారణంగా సముద్ర ఉష్ణోగ్రత 3 డిగ్రీలు పెరిగింది. ఉష్ణోగ్రతలో 4 డిగ్రీల పెరుగుదల వాతావరణ మార్పుల పరంగా ఒక పెద్ద మార్పుగా పరిణమించవచ్చు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ప్రస్తుతం దాని 30 ఏళ్ల సగటు కంటే 2.6 డిగ్రీలు పెరిగింది.

2027 అత్యంత వేడి సంవత్సరం 

బీబీసీ నివేదిక ప్రకారం.. ఎల్ నినో ప్రభావం వల్ల 2027 రికార్డు స్థాయిలో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచే అవకాశం ఉంది. దీని ప్రభావం వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతల రూపంలో కనిపించవచ్చు. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో అన్ని ఉష్ణ రికార్డులను బద్దలు కొట్టగలదని బ్రిటిష్ వాతావరణ శాస్త్రవేత్త నిక్ డన్‌స్టోన్ అంటున్నారు. ఇది 2024లో నమోదైన 1.5 డిగ్రీల స్థాయి నుంచి గణనీయమైన పెరుగుదల.

భారతదేశంపై ప్రభావం

భారతదేశంలోని రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ఆగస్టు ముగుస్తున్న కొద్దీ రుతుపవనాల కార్యకలాపాలు మందగించడం మొదలైంది. ఆకాశంలో మబ్బులు ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ వర్షపాతం లేదు. ఎగువ ప్రాంతాల నుంచి వర్షాన్ని తీసుకువచ్చే రుతుపవన ద్రోణి లేదా ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా క్రియాశీలం కావడం లేదు. రుతుపవన కాలంలోని నాలుగు నెలల వర్షపాతం సాధారణం కంటే కేవలం 90 శాతం మాత్రమే ఉంటుందని, ఇది గత 11 ఏళ్లలో అత్యంత కనిష్టమని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెదర్ ఈ అంకెను 85 శాతానికి మరింత తగ్గించింది.

పంటలపై ప్రభావం

కర్ణాటకతో సహా కొన్ని రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం కారణంగా వరితో సహా పలు పంటల సాగు విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. తగ్గిన వర్షపాతం, జలాశయాలలో నీటి కొరతతో కలిసి.. వచ్చే ఏడాది ప్రారంభంలో గోధుమ, ఆవాలు వంటి రబీ పంటలపై ప్రభావం చూపవచ్చు. చెరకు పంట దిగుబడులు కూడా ప్రభావితం కావచ్చు. తక్కువ చెరకు దిగుబడులు ఇప్పటికే చక్కెర ధరలు ఆకాశాన్నంటడానికి దారితీశాయి.

ఎల్ నినో ఎప్పుడు సంభవిస్తుంది?

సాధారణంగా భూమధ్యరేఖ సమీపంలో వాణిజ్య పవనాలు తూర్పు నుంచి పడమర వైపు వీస్తాయి. ఈ పవనాలు వెచ్చని పసిఫిక్ మహాసముద్రపు నీటిని ఆసియా, ఆస్ట్రేలియా వైపు నెడతాయి. అయితే ఈ పవనాలు బలహీనపడినప్పుడు లేదా దిశను మార్చుకున్నప్పుడు, ఎల్ నినో సంభవిస్తుంది. దీంతో పడమర వైపు నెట్టబడిన వెచ్చని నీరు, దక్షిణ అమెరికాలోని పెరూ, ఈక్వెడార్ తీరాల వైపు మళ్లుతుంది. ఈ దృగ్విషయం ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. ఒకసారి క్రియాశీలమైన తర్వాత ఎల్ నినో 9 నుంచి 12 నెలల పాటు కొనసాగుతుంది. ఇది సాధారణంగా జూన్- జూలై మధ్యలో ప్రారంభమై డిసెంబరులో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.

కరవు హెచ్చరికలు

ఎల్ నినో కారణంగా తీవ్రమవుతున్న గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల ప్రభావాలు గత కొన్ని దశాబ్దాలుగా కనిపిస్తున్నాయి. రుతుపవన మార్పులు మరింత తీవ్రమవుతున్నాయని ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాలు లేకపోవడం వల్ల పూర్తి కరవు ఏర్పడుతుండగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు తీవ్ర వరదలకు కారణమవుతున్నాయి. భారతదేశంలో రుతుపవన వర్షాల సంఖ్య తగ్గినా, వాటి తీవ్రత పెరిగింది. కొన్నిసార్లు రుతుపవన కాలంలో 15 రోజుల పాటు వర్షం కురవకపోతే, మరికొన్నిసార్లు ఒక్క రోజు కురిసిన భారీ వర్షానికే నగరాలు, గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆగస్టు నెలలో ఢిల్లీ, గురుగ్రామ్‌లలో ఇది కనిపించింది. ప్రస్తుతం, ఈశాన్య ప్రాంతంలో సంభవించిన తీవ్ర వరదల ప్రభావం గౌహతి వరకు కనిపిస్తోంది.