
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ ఎట్టకేలకు భారత్ పర్యటనకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగిస్తేనే గానీ.. తారిఖ్ రెహమాన్ భారత్లో పర్యటించరని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే భారత్ నుంచి సానుకూల వాతావరణం ఉండడంతో శాంతించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటనకు వస్తున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఆగస్టు 23 నుంచి 25 వరకు భారత్లో పర్యటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తారిఖ్ రెహమాన్ భారత్కు రావడం ఇదే తొలిసారి కానుంది. ఫిబ్రవరిలో ఆయన బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
షేక్ హసీనా అప్పగింత వివాదం
తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటన నేపథ్యంలో షేక్ హసీనా అప్పగింత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉన్నారు. ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను కోరుతోంది. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్.. హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనను సంబంధిత చట్టాలు, న్యాయ ప్రక్రియలకు అనుగుణంగా పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.
తొలి పర్యటన..
ఫిబ్రవరిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తారిఖ్ రెహమాన్ భారత్కు రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా షేక్ హసీనా అప్పగింతతో పాటు భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న పలు అంశాలపై ఇరు దేశాల నేతల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రెహమాన్ భారత్ పర్యటనపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఆగస్టు 23 నుంచి 25 వరకు ఆయన పర్యటించే అవకాశం ఉందన్న సమాచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.