
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఉజ్వల స్కూల్లో పాము కలకలం రేపింది. బుధవారం స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థిని బ్యాగులోకి పాము చేరింది. బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత బ్యాగు నుంచి పాము బయటకు రావడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమై పామును బయటకు పంపించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురువారం వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, పాములు, ఇతర విషపురుగులు స్కూల్లోకి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.