
Taapsee vs Kangana: బాలీవుడ్లో ఏళ్లుగా వార్తల్లో నిలుస్తున్న కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య మాటల యుద్ధం మరోసారి హాట్ టాపిక్గా మారింది. 2019లో మొదలైన ఈ వివాదం, రీసెంట్ గా ఇండియా టుడే ఉమెన్ సమ్మిట్ 2026లో తాప్సీ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి వచ్చింది. కంగనాతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదని చెప్పిన తాప్సీ, ఒక వ్యక్తి మాట్లాడే తీరు వాళ్ళ “పెంపకం” మీద ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను కంగనా తీవ్రంగా తప్పుబడుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఘాటు కౌంటర్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో మరోసారి ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది.
వాస్తవానికి కంగనా, తాప్సీ ఇద్దరూ చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ‘అవుట్సైడర్స్’గా ఎదిగిన నటీమణులే. అయితే ఇద్దరి మధ్య విభేదాలు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ఈ వివాదానికి బీజం పడింది మాత్రం 2019లోనే. ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా విడుదల సమయంలో తాప్సీ ట్రైలర్ను ప్రశంసించినప్పటికీ, కంగనా పేరును ప్రస్తావించలేదు. దాంతో కంగనా సోదరి రంగోలి చందేల్ సోషల్ మీడియాలో తాప్సీని “సస్తి కాపీ” (చౌకబారు నకలు) అంటూ విమర్శించారు. తర్వాత 2020లో కంగనా ఒక టీవీ ఇంటర్వ్యూలో తాప్సీని బి-గ్రేడ్ నటీమణులు అని సంబోధిస్తూ, ఇండస్ట్రీలోని పలుకుబడి ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అప్పట్లో తాప్సీ కూడా కౌంటర్ ఇస్తూ, తాను సినిమా అవకాశాల కోసం ఎవరికీ లొంగిపోలేదని, అవుట్సైడర్ అయినంత మాత్రాన కంగనాను అనుసరించాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇప్పుడు తాజాగా ఇండియా టుడే ఉమెన్ సమ్మిట్లో తాప్సీ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి ముదిరింది. కంగనాను తాను ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని, వివాదాలకు ముందు కానీ తర్వాత కానీ ముఖాముఖి మాట్లాడే అవకాశం రాలేదని ఆమె చెప్పారు. ఒక వ్యక్తి మాట్లాడే తీరు అతని పెంపకాన్ని, ప్రపంచాన్ని చూసే కోణాన్ని ప్రతిబింబిస్తుంది. ఎవరు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చారో ప్రజలే చూసి నిర్ణయించుకోవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. అదే సమయంలో తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కూడా స్పష్టం చేస్తూ, తాను నిజాయితీగా, సున్నితంగా ఉండే వ్యక్తినని, తన దృష్టంతా ఇంకా మంచి సినిమాలు చేయడంపైనే ఉందని వెల్లడించారు.
తాప్సీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ కొద్ది గంటల్లోనే ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించారు. తాప్సీ తన కొత్త సినిమా ప్రచారం కోసం మరోసారి తన పేరునే వాడుకుంటోందని ఆరోపించారు. అలాగే తన తల్లిదండ్రులు, తన పెంపకం గురించి మాట్లాడటం హద్దులు దాటినట్లుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో ఉపయోగించిన “చౌకబారు కాపీ” అనే పదాన్ని మళ్లీ ప్రస్తావిస్తూ, నా తల్లిదండ్రులలాగా ఒక ఒరిజినల్ వ్యక్తిని ఎందుకు పెంచలేకపోయారు? అంటూ వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ స్టోరీ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదం మధ్య తాప్సీ కెరీర్ కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాంధారి’ ఇటీవల మంచి ప్రశంసలు అందుకోగా, ఆ చిత్రం సెప్టెంబర్ 3 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు తెలుగు ప్రేక్షకులకు ‘ఝుమ్మంది నాదం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘వీర’, ‘మొగుడు’, ‘షాడో’ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్లో కంటెంట్ ఆధారిత సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం కంగనా, తాప్సీ తాజా వ్యాఖ్యలు మళ్లీ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా? లేక మరోసారి కొత్త మలుపు తిరుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.