Reading Time: < 1 minute
Tamil Nadu Gold Ring Scheme One Paisa Tender Controversy

తమిళనాడు ప్రభుత్వం నవజాత శిశువులకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరాన్ని అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ‘తై మామన్ తంగ మోదిరమ్’ (మేనమామ బంగారు ఉంగరం) పథకం టెండర్ వ్యవహారం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. మొత్తం 4,41,667 ఉంగరాల కొనుగోలుకు రూ. 755.83 కోట్ల ఖర్చు అంచనాతో పిలిచిన టెండర్‌లో 11 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. అయితే.. బంగారం ధరను మినహాయించి మేకింగ్, వేస్టేజ్, హాల్‌మార్కింగ్, బీమా, రవాణా వంటి అదనపు ఖర్చులన్నింటికీ కలిపి ప్రముఖ జువెలరీ సంస్థ జోయ్ అలుక్కాస్ కేవలం ఒక్క పైసా (రూ. 0.01) మాత్రమే కోట్ చేయడం ఈ వివాదానికి మూలంగా మారింది.

ఈ టెండర్ నిబంధనల ప్రకారం అసలు బంగారం ధరను ప్రభుత్వం నాటి IBJA (ఇండియన్ బుల్లియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్) మార్కెట్ రేటు ఆధారంగా విడిగా చెల్లిస్తుంది. పోటీ కేవలం సర్వీస్ ఛార్జీలపైనే జరగడంతో జోయ్ అలుక్కాస్ L1గా నిలిచింది. టెండర్ నిబంధనలను అనుసరించి L1 ధరకు సరఫరా చేసేందుకు మిగిలిన సంస్థలకు అవకాశం ఇవ్వగా, కల్యాణ్ జువెల్లర్స్ మాత్రమే ఆ ఒక్క పైసా ధరకు సమ్మతించింది. దాంతో ప్రభుత్వం జోయ్ అలుక్కాస్‌కు 70 శాతం, కల్యాణ్ జువెల్లర్స్‌కు 30 శాతం ఆర్డర్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ టెండర్ ప్రక్రియపై ప్రతిపక్ష డిఎమ్‌కె, ఇతర వర్గాలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. తయారీ, రవాణా, బీమా, హాల్‌మార్కింగ్ ఖర్చులు భారీగా ఉండే క్రమంలో కేవలం ఒక్క పైసాకే వ్యాపార సంస్థలు ఎలా సరఫరా చేస్తాయనేది ప్రధాన ప్రశ్న. వ్యాపార ప్రయోజనాలు లేకుండా లేదా వేరే రూపంలో లాభం పొందే అవకాశం లేకుండా ఇది సాధ్యం కాదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఇది ప్రజాసంక్షేమ పథకం కావడంతో ఎలాంటి వ్యాపార లాభాలు ఆశించకుండా సామాజిక బాధ్యతగా ఈ సేవను అందిస్తున్నామని టెండర్ పొందిన సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా ఎల్1 ఎంపిక పూర్తి చేశామని వివరణ ఇచ్చింది. రూ. 755 కోట్ల భారీ పథకంలో అసలు బంగారం వ్యయం ప్రభుత్వమే భరిస్తుండగా, ఈ ఒక్క పైసా వ్యూహం వెనుక ఉన్న అసలు కారణాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.