Reading Time: < 1 minute
Bandi Sanjay Meets Yogi Adityanath Telangana Bjp Discussion

Bandi Sanjay : ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు (శుక్రవారం) సాయంత్రం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. కేంద్ర పారామిలటరీ అయిన సశస్త్ర సీమా బల్ కు చెందిన పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం నేరుగా లక్నోలోని సీఎం అధికార నివాసానికి వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు అరగంటకుపైగా వీరిద్దరి భేటీ జరిగింది.

ప్రధానంగా తెలంగాణలో పార్టీ పరిస్థితి, యూపీ ఎన్నికలపై చర్చ జరిగింది. తెలంగాణ అభివ్రుద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూర్తిగా సహకరిస్తున్నారని యోగి తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణకు మరింత మేలు జరుగుతుందని ఉత్తర ప్రదేశ్ ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. యూపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ కొనసాగడంవల్ల మోదీ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివ్రుద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, నాయకులంతా కలిసికట్టుగా పని చేస్తే అధికారంలోకి కచ్చితంగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో ఉత్తర ప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయని, మోదీ నాయకత్వంలో ముచ్చటగా మూడవ సారి కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.