
ఈ ఘోర కలియుగంలో బంధాలకు అర్థం లేకుండా పోతోంది.. కేవలం ఐదు వందల రూపాయల నోటు ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కన్నతండ్రి అని కూడా చూడకుండా ఓ కసాయి కొడుకు కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
డబ్బు మనుషుల మధ్య బంధాలను తెంచేస్తోంది. క్షణికావేశం కన్నతండ్రిని పొట్టనబెట్టుకునేలా చేస్తోంది. అల్లిపూర్లో జరిగిన ఘోర సంఘటనే దీనికి నిదర్శనం. గ్రామానికి చెందిన 70 ఏళ్ల శంకర్ అనే వృద్ధుడు తన కుమారుడు తుకారం(35)తో కలిసి నివసిస్తున్నాడు. అయితే, తుకారం తన ప్యాంట్ జేబులో ఉన్న 500 రూపాయలను పోగొట్టుకున్నాడు. ఆ ఐదు వందల రూపాయల నోటే ఈ కుటుంబంలో పెద్దచిచ్చు రేపింది.
తన జేబులో పోయిన 500 రూపాయలను తండ్రి శంకరే తీసుకున్నాడని కుమారుడు తుకారం అనుమానించాడు. దీంతో తండ్రితో తీవ్రంగా గొడవకు దిగాడు. నేను నీ డబ్బులు తీసుకోలేదురా అని ఆ వృద్ధ తండ్రి ఎంత బ్రతిమిలాడిన, మొత్తుకున్నా ఆ కసాయి కొడుకు కనికరించదు. క్షణికావేశంతో ఊగిపోయిన తుకారం.. ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తితో పొడవడమే కాకుండా.. తండ్రి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. దీంతో శంకర్ అక్కడికక్కడే కుప్పకూలి, రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు.
కేవలం 500 రూపాయల కోసం కన్నతండ్రిని కొడుకే దారుణంగా చంపేయడంతో అల్లిపూర్ గ్రామం ఒక్కసారిగా షాక్కు గురైంది. సమాచారం అందుకున్న జహీరాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు తుకారంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐదు వందల కోసం కన్న తండ్రి గొంతు కోసిన కొడుకును కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..