Reading Time: 2 minutes
Ys Jagan Focuses On Local Body Polls Ycp Prepares 175 Constituencies

YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ ఇంచార్జ్‌లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే నాలుగైదు రోజులు అత్యంత కీలకమని, అర్హులైన ఓట్లు తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల సూచించారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటును పరిశీలించాలని, డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై అభ్యంతరాలు దాఖలు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా అవసరమైన ఫారాలను సమర్పించి వారి ఓట్లను కొనసాగించేలా చూడాలని స్పష్టం చేశారు.

44 లక్షల నోటీసుల అంశంపైనా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాలని సజ్జల పార్టీ నేతలకు సూచించారు. అర్హులైన ఓటర్లకు సంబంధించిన అంశాల్లో అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని, చిరునామా మార్పులు, ఇతర ఓటరు వివరాల సవరణలకు అవసరమైన ఫారాలను కూడా దాఖలు చేయాలని చెప్పారు.. అభ్యంతరాలు లేదా దరఖాస్తులు సమర్పించిన ప్రతిసారీ సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సజ్జల సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం రసీదులు, సంబంధిత పత్రాలను భద్రపరచుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.

ఓటర్ల జాబితాలకు సంబంధించిన ప్రధాన ప్రక్రియను ఆగస్టు 27, 28 తేదీల నాటికి పూర్తి చేయాలని సజ్జల ఆదేశించారు. రాష్ట్రానికి, ప్రాంతానికి బయట ఉన్న ఓటర్ల వివరాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వ్యవహారంలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు సజ్జల.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని సజ్జల స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఓటర్ల జాబితాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 25న వైఎస్ జగన్‌తో 175 నియోజకవర్గాల కోఆర్డినేటర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, పార్టీ శ్రేణుల కార్యాచరణ, నియోజకవర్గాల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై జగన్ కీలక సూచనలు చేయనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.