
రాజమండ్రిలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితుల రిమాండ్ను జిల్లా కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో నిందితులు సూరవరపు దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్లకు విధించిన పోలీస్ కస్టడీ ముగియడంతో.. వీరిని రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. పోలీస్ కస్టడీ సమయంలో నిందితులను పలుమార్లు విచారించిన దర్యాప్తు అధికారులు కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
కస్టడీ గడువు పూర్తికావడంతో నిందితులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా.. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వారి రిమాండ్ను న్యాయస్థానం మరో 14 రోజులు పొడిగించింది. కోర్టు ఆదేశాల అనంతరం నిందితులను కట్టుదిట్టమైన భద్రత నడుమ తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించి అప్పగించారు. డాక్టర్ ప్రియాంక హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దర్యాప్తు అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు పురోగతిపై ప్రజల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.