Reading Time: < 1 minute
Sugar Prices: పండుగల వేళ పెరిగిన చక్కెర ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం!

భారత్‌ ప్రపంచలోనే చక్కెరను ఉత్పత్తి చేస్తున్న రెండో అతిపెద్ద దేశం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనం ఒకరికి అమ్మే స్టేజ్ నుంచి మనమే ఒకరి వద్ద నుంచి కొనే స్టేజ్‌ వచ్చేశాం. అవును ఇప్పుడు మన దేశంలో చక్కెర కొతర ఏర్పడింది. దీంతో ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత తొలిసారి చక్కెరను దిగుమతి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇథనాల్ ఉత్పత్తికి చెరుకును ఉపయోగించడమే చక్కెర కొరత, ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్న మాట.

దశాబ్ధం తర్వాత దిగుమతికి నిర్ణయం

ప్రస్తతం దేశంలో నెలకొన్న చక్కెర కొరతను అడ్డుకునేందుకు, పెరుగుతున్న ధరలను నియంత్రణలో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే విదేశాల నుంచి 10 లక్షల టన్నుల చక్కెరను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. సాదారణంగా అక్టోబర్ నుంచే పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశంలో చక్కెర వినియోగం పెరుగే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ధరల పెరుగుదల

అక్టోబర్ ప్రారంభంలో సాధారణంగా ఉండే 50 లక్షల టన్నులకు బదులుగా, ప్రారంభ నిల్వలు 35-40 లక్షల టన్నులకు పడిపోయాయి. దీంతో దేశంలో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. గతంలో రూ. 45గా ఉన్న చక్కెర ధర ఆగస్టు 19న రూ. 52.3కు చేరింది. గతేడాదితో పోలిస్తే ఇది 13 శాతం అధికం. జూలైలో చిల్లర ధరలు 9శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. ఈ ధరల పెరుగుదలతో అక్రమ నిల్వలు అడ్డుకోవడానికి ప్రభుత్వం ఈ నిల్వలపై పరిమితులు విధించడంతో పాటు, డీలర్లు ప్రతి వారం తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది.

గ్లోబల్ మార్కెట్‌పై ప్రభావం

భారత్ తీసుకునే నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. భారత్ సుంకం లేని దిగుమతులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించిన వెంటనే,లండన్‌లో బెంచ్‌మార్క్ వైట్ షుగర్ ఫ్యూచర్స్, న్యూయార్క్‌లో ముడి చక్కెర ఫ్యూచర్స్ ధరలు దాదాపు 4 శాతం పెరిగినట్టు నివేదికలు పేర్కొన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.