Reading Time: < 1 minute
Ys Viveka Murder Case Ed Seizes Rs 24 Lakh From Avinash Reddys Residence

YS Viveka M*urder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్, కడప జిల్లాల్లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. సోదాల్లో నేరానికి సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. CBI నమోదు చేసిన FIR, దాఖలు చేసిన చార్జ్‌షీట్ల ఆధారంగా ఈ కేసులో ECIR నమోదు చేసినట్లు ED తెలిపింది. IPCలోని సంబంధిత సెక్షన్లు, PMLA కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.

వైఎస్‌ అవినాష్ రెడ్డి నివాసంలో రూ.24 లక్షలు సీజ్
సోదాల్లో భాగంగా ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదును గుర్తించి సీజ్ చేసినట్లు ED వెల్లడించింది. ఆ నగదుకు సంబంధించి సరైన వివరాలు ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో అవినాష్ రెడ్డికి చెందిన రెండు బ్యాంక్ లాకర్ల తాళాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ED తెలిపింది. సోదాల్లో లభించిన కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలను తదుపరి దర్యాప్తులో పరిశీలించనున్నట్లు పేర్కొంది.

హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందని..
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాలను కూడా ED తన ప్రకటనలో ప్రస్తావించింది. హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగినట్లు దస్తగిరి వెల్లడించినట్టు తెలిపింది. హత్య కోసం దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఆఫర్ చేసినట్లు దస్తగిరి వెల్లడించారని ED పేర్కొంది. ఆ మొత్తం నుంచి తనకు రూ.5 కోట్లు వాటాగా ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి ప్రలోభపెట్టినట్లు దస్తగిరి చెప్పిన విషయాన్ని కూడా ED ప్రస్తావించింది.

సోదాల్లో కీలక ఆధారాల సేకరణ
హైదరాబాద్, కడప జిల్లాల్లో కీలక నిందితులకు సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలను సేకరించినట్లు ED తెలిపింది. ముఖ్యంగా పత్రాలు, డిజిటల్ పరికరాలు, నగదు, లాకర్లకు సంబంధించిన వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ED.. CBI దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను ఆధారంగా చేసుకుని తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది.