
Smartphone Buying Trends: స్మార్ట్ఫోన్ అనగానే ముందుగా.. కెమెరా ఎన్ని పిక్సల్స్.. ఫొటో క్వాలటీ ఎలా ఉంటుంది.. బ్యాటరీ బ్యాకప్ పరిస్థితి ఏంటి అని చూస్తుంటారు.. కానీ, స్మార్ట్ఫోన్ కొనుగోలు నిర్ణయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు కీలకంగా మారుతున్నాయి. అమెజాన్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. ఏకంగా 82 శాతం మంది స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులు AI ఫీచర్లను తమ కొనుగోలు నిర్ణయంలో ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నారు. 2026 జూలైలో నిర్వహించిన ఈ సర్వేలో స్మార్ట్ఫోన్లతో పాటు ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, గృహోపకరణాల విభాగాలకు చెందిన 40,000 మందికిపైగా వినియోగదారుల అభిప్రాయాలను సేకరించారు.
ఏఐలో ఈ ఫీచర్లకే ఎక్కువ డిమాండ్
వినియోగదారులను ఆకట్టుకుంటున్న AI ఫీచర్లలో కాంటెక్స్చువల్ అసిస్టెన్స్ ముందంజలో ఉంది. 25 శాతం మంది దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. వినియోగదారుడి అవసరాన్ని అర్థం చేసుకుని రియల్టైమ్లో సహాయం చేయడం దీని ప్రత్యేకత. ఆ తర్వాత జనరేటివ్ ఫొటో ఎడిటింగ్కు 18 శాతం, విజువల్ సెర్చ్కు 17 శాతం మంది ప్రాధాన్యత ఇచ్చారు. అడాప్టివ్ బ్యాటరీ మేనేజ్మెంట్ను 11 శాతం మంది ముఖ్యమైన ఫీచర్గా పేర్కొన్నారు.
పనితీరు, బ్యాటరీకి కూడా ప్రాధాన్యం
AIపై ఆసక్తి పెరిగినా.. స్మార్ట్ఫోన్ ప్రాథమిక అంశాల విషయంలో వినియోగదారులు రాజీపడటం లేదని సర్వే వెల్లడించింది. 87 శాతం మంది పనితీరు, వేగాన్ని అత్యంత ముఖ్యమైన అంశాలుగా పేర్కొన్నారు. 79 శాతం మంది బ్యాటరీ లైఫ్కు, 77 శాతం మంది కెమెరా నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చారు. తమ ప్రస్తుత ఫోన్లలో మెరుగైన బ్యాటరీ లైఫ్ కావాలని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు.
రూ.25 వేల–రూ.50 వేల ఫోన్లకు డిమాండ్
ఇక, ధరల విషయానికొస్తే.. 42 శాతం మంది వినియోగదారులు రూ.25,000 నుంచి రూ.50,000 మధ్య ధర కలిగిన స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు 48 శాతం మంది రాబోయే మూడు నెలల్లో తమ ఫోన్ను అప్గ్రేడ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఫోన్ కొనుగోలులో రివ్యూలు, రేటింగ్లకు కూడా వినియోగదారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 47 శాతం మంది రివ్యూలు, రేటింగ్లను ముఖ్యంగా పరిగణిస్తుండగా, 35 శాతం మంది ధర, డీల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో AI ఇక అదనపు ఫీచర్గా కాకుండా కొనుగోలుదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారుతోంది. అయితే AIతో పాటు వేగవంతమైన పనితీరు, మెరుగైన బ్యాటరీ, మంచి కెమెరా వంటి ఫీచర్లకు కూడా వినియోగదారులు సమానంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది.