
దేశంలో చక్కెర ధరలు కొండెక్కుతున్నాయి. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న తరుణంలో పంచదార ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో రూ.65కు పెరిగిపోయింది. ఇక మహారాష్ట్రలో ఎక్స్-మిల్ చక్కెర ధరలు క్వింటాల్కు రూ.5,400 నుంచి రూ.5,560కి పెరిగింది. పైగా దేశంలో చక్కెర నిల్వలు కూడా అయిపోయాయి. ఈ నేపథ్యంలో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో వ్యాపారులు కూడా బల్క్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లకు సిద్ధపడుతుండడంతో ఉన్న నిల్వలు అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారిగా చక్కెరను దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దేశీయంగా చక్కెర నిల్వలు తగ్గిపోవడం, ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. పండుగల సీజన్ ముందు వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గురువారం ముడి చక్కెర దిగుమతి విధానంలో మార్పులు చేసింది. టారిఫ్ రేట్ కోటా కింద 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ముడి చక్కెరను డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. టారిఫ్ రేట్ కోటా విధానంలో నిర్దిష్ట పరిమాణంలో వస్తువులను తక్కువ లేదా సున్నా కస్టమ్స్ డ్యూటీతో దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఈ డ్యూటీ ఫ్రీ దిగుమతుల పరిమితిని 10 లక్షల టన్నులుగా నిర్ణయించారు. ఈ అవకాశం 2026 అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
దేశంలో చక్కెర ధరలు కేవలం రెండు నెలల్లోనే దాదాపు 40 శాతం పెరిగాయి. దేశీయంగా సరఫరాలు తగ్గిపోవడంతో ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వినియోగదారులపై మరింత భారం మోపే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెరను వినియోగించే దేశం భారత్. దీంతో దేశీయ మార్కెట్లో సరఫరాలను పెంచి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతుల మార్గాన్ని ఎంచుకుంది.
దేశీయ మార్కెట్లో చక్కెర ధరలను తగ్గించేందుకు కేంద్రం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు చక్కెర వ్యాపారులు, డీలర్లపై స్టాక్ పరిమితులను విధించింది. చక్కెరను అక్రమంగా నిల్వ చేయడం, ఊహాజనిత ట్రేడింగ్ను అడ్డుకోవడంతో పాటు మార్కెట్లో తగినంత సరఫరా ఉండేలా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.