
- సీపీఐ, ఏఐఎఫ్బీ, బీఆర్ఎస్నాయకుల ఆందోళన
- గ్రామస్తులు, పోలీసుల మధ్య తోపులాట
- ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి యత్నం
గంగాధర, వెలుగు: తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తుల ఆందోళన కొనసాగుతోంది. మధురానగర్ చౌరస్తాలోని కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై శనివారం ధర్నా చేపట్టగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఏఐఎఫ్బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి జోజిరెడ్డి మద్దతు పలికారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక నారాయణపూర్ను ముంపు గ్రామం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించి నష్ట పరిహారం అందించాలని కోరారు. ధర్నాకు దిగిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురికి స్వల్పగాయాలు కాగా, సహీన అనే మహిళ కాలు విరిగిందని గ్రామస్తులు ఆరోపించారు.
అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రజా కార్యాలయాన్ని ముట్టడించేందుకు మహిళలు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. సుంకె రవిశంకర్తోపాటు పలువురు గ్రామస్తులను రామడుగు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ను గ్రామస్తులు ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ సదర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకుంటానన్న మేడిపల్లి సత్యం నారాయణపూర్ గ్రామస్తులపై కేసులు పెట్టడం విడ్డూరమన్నారు. గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.