
Hema Slams Anasuya: నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదంపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సీనియర్ నటి హేమ తీవ్రంగా స్పందించారు. ఇటీవల అనసూయ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. కొంతమంది ‘జై శ్రీరామ్’ ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని, కేవలం నినాదాలు చేయడం కంటే ప్రవర్తన ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ మొత్తం వ్యవహారం మీద అనసూయ మీద విమర్శలు రావడంతో ఆ తర్వాత ఆమె స్పందిస్తూ తన మాటలను కావాలని కొందరు వక్రీకరించారని, తాను కూడా హనుమంతుడి భక్తురాలినని వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ వివాదంపై నటి హేమ కూడా ఒక వీడియో సందేశం ద్వారా అనసూయకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘జై శ్రీరామ్’ అనేది కేవలం ఒక స్లోగన్ కాదని, అది కోట్లాది మంది హిందువుల గుండెల్లో నిలిచిపోయిన ఒక పవిత్రమైన మంత్రమని హేమ పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మనమందరం అద్దాల మేడలో బతుకుతున్నామని, సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతి మాటను జనాలు బూతద్దంలో చూస్తారని గుర్తుచేశారు. ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడాలి అనుకుంటే, ధైర్యంగా నేరుగా వారి పేర్లు చెప్పాలి తప్ప.. ఇలా మొత్తం వ్యవస్థను లేదా నినాదాన్ని తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు. నోటిలో మాట వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని హితవు పలికారు.
చివరగా, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుందని హేమ హెచ్చరించారు. కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు, ఇంతకు ఇంత తిరిగి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవైపు దేవుడంటే భక్తి అంటూనే, మరోవైపు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని, చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండాలని చురకలేశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ప్రముఖ నటీమణుల మధ్య జరిగిన ఈ వాడివేడి వ్యాఖ్యల యుద్ధం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్గా మారింది.