
సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్కాస్ట్ షోలో పాల్గొని తమ రాబోయే ప్రాజెక్ట్లకు సంబంధించిన ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) తర్వాత సందీప్ చేపట్టబోయే ప్రాజెక్టుల రోడ్మ్యాప్ను ఆయన వివరించారు.’స్పిరిట్’ పూర్తయిన తర్వాత సందీప్ వంగ దాదాపు 6 నెలల పాటు విరామం తీసుకుంటారని ప్రణయ్ చెప్పారు. ఆ తర్వాతే మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టి పట్టాలెక్కిస్తారని స్పష్టం చేశారు. సందీప్ కథలు రాసే విషయంలో ఎక్కువ సమయం తీసుకుంటారని తెలిపారు.
సూపర్స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనేది తమ తండ్రిగారి కోరిక అని ప్రణయ్ రెడ్డి వెల్లడించారు. ఈ కాంబినేషన్కు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ చర్చలు జరిగాయని, సందీప్ మైండ్లో మహేష్ కోసం ఒక లైన్ ఉన్నప్పటికీ అధికారికంగా ప్రాజెక్ట్ ఖరారయ్యే వరకు ఏదీ చెప్పలేమని పేర్కొన్నారు.