
అమరావతి, ఆగస్ట్ 22: ఎంబీబీఎస్ తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సవరించింది. అఖిల భారత కోటా (AIQ), డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో మార్పులు చేసింది. అఖిల భారత కోటా (AIQ), డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలకు ఆగస్టు 4న ప్రారంభమైన తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. ఈ రౌండ్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 31లోగా సంబంధిత వైద్య కళాశాలలో చేరాల్సి ఉంటుంది.
రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ సెప్టెంబర్ 5 వరకు..
రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 13న ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఆగస్టు 27 వరకు కొనసాగనుంది. రాష్ట్ర కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 5లోగా తమకు కేటాయించిన వైద్య కళాశాలలో చేరాలి. కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాల్సి ఉన్నందున ఎంసీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని వైద్య కళాశాలలు, విద్యాసంస్థలు శని, ఆదివారాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సెలవు రోజులను కూడా సాధారణ పని దినాలుగా పరిగణించాలని సూచించింది.
కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఎలాంటి ఆలస్యం లేకుండా అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలలో చేరేందుకు సంబంధించిన గడువులను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.