Reading Time: 2 minutes
Imran Khan Medical Checkup Medically Fit Returned Adiala Jail

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో ఆయన్ను తిరిగి అడియాలా జైలుకు తరలించారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించి.. జైలులో కొనసాగేందుకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.

పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నేత్ర వైద్య నిపుణుడు, కార్డియాలజిస్ట్, ఫిజీషియన్ సహా నిపుణుల బృందం ఇమ్రాన్ ఖాన్‌కు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిందని తెలిపారు. ‘‘వైద్యులు ఆయనను మెడికల్‌గా ఫిట్‌గా ప్రకటించారు. పరీక్షల ప్రక్రియ పూర్తైన తర్వాత తిరిగి అడియాలా జైలుకు తరలించారు’’ అని పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్‌ను ప్రైవేట్ ఆసుపత్రి అయిన షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆయనను ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తీసుకెళ్లినట్లు మంత్రి అత్తావుల్లా తరార్ తెలిపారు. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌ను అర్ధరాత్రి సమయంలో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య సేవలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించినట్లు జియో న్యూస్ పేర్కొంది. ప్రస్తుతం ఆయనను జైలులోని సెల్‌కు తరలించారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో పలువురు పీటీఐ మద్దతుదారులు అక్కడికి చేరుకున్నట్లు ఫ్రెంచ్ వార్తా సంస్థ తెలిపింది.

ఇమ్రాన్ ఖాన్ సోదరి ఉజ్మా ఖాన్ ఆసుపత్రిలో తన సోదరుడిని కలిశారు. ఏకాంత నిర్బంధం కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇమ్రాన్ తనతో చెప్పారని ఆమె తెలిపారు. ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఫైసల్ సుల్తాన్‌తో కలిసి అడియాలా జైలుకు రావాలని రాత్రి సమయంలో తమకు ఫోన్ వచ్చిందని ఉజ్మా చెప్పారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల సమయంలో జైలుకు చేరుకున్నామని.. అక్కడ తమను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గదికి తీసుకెళ్లారని తెలిపారు. ఆ తర్వాత అధికారులు తనను, డాక్టర్ ఫైసల్ సుల్తాన్‌ను వేరు చేశారని.. తనను పోలీసు వాహనం, ల్యాండ్ క్రూయిజర్ ఎస్కార్ట్‌తో PIMS ఆసుపత్రికి తీసుకెళ్లారని ఉజ్మా వెల్లడించారు. సుప్రీంకోర్టు షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స చేయాలని ఆదేశించిన విషయాన్ని అధికారులను ప్రశ్నించగా.. ఇమ్రాన్ కంటి చికిత్సకు సంబంధించిన ఫాలోఅప్ కోసం తీసుకెళ్లినట్లు చెప్పారని తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్‌కు రైట్ సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లూజన్ అనే కంటి సమస్య ఉన్న విషయం జనవరి చివరిలో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆయనను పలుమార్లు పీఐఎంఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించిందని, కుడి కంటిచూపును గణనీయంగా కోల్పోయారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 48 గంటల్లోగా ఇమ్రాన్ ఖాన్‌ను షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు తరలించాలని, ఆయన వ్యక్తిగత వైద్యుడు కూడా ఉన్న మెడికల్ ప్యానెల్‌తో చికిత్స అందించేందుకు అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై పాకిస్థాన్ ప్రభుత్వ వైఖరిపై కూడా వివాదం నెలకొంది. తొలుత ఆదేశాలను అమలు చేస్తామని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలను పునఃపరిశీలించి, వెనక్కి తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఇమ్రాన్ ఖాన్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడాన్ని పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి ఆజమ్ నజీర్ తరార్ వ్యతిరేకించారు. చట్టం ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి జైలులో లేదా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని ఆయన పేర్కొన్నారు. ఇమ్రాన్ వైద్య పరీక్షలను ప్రైవేట్ ఆసుపత్రికి బదులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తామని పీటీఐ హెచ్చరించింది. గురువారం రాత్రి 11.59 గంటల్లోగా ఇమ్రాన్‌ను ఆసుపత్రిలో చేర్చాలని డిమాండ్ చేసింది. తర్వాత పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిఖ్ ఫజల్ చౌధరి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం లేదా అమలులో జాప్యం చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు.

2023 ఆగస్టు నుంచి జైలులోనే..

ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండిస్తోంది. తాజా వైద్య పరీక్షల అనంతరం ఇమ్రాన్‌ను తిరిగి అడియాలా జైలుకు తరలించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది.