
Gachibowli Bike Accident: హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ఐటీ ఉద్యోగి దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్కు చెందిన సహస్ర చటోపాధ్యాయ, అభిరూప్, అబ్బాస్ (25) అనే ముగ్గురు స్నేహితులు ఒకే బైక్పై ఖాజాగూడ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గచ్చిబౌలిలోని స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపానికి రాగానే బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అబ్బాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఒకరి పరిస్థితి విషమం.. హెల్మెట్ వల్ల ప్రాణాలతో బయటపడ్డ మరొకరు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అభిరూప్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, మరో యువకుడు సహస్ర చటోపాధ్యాయ తలకు హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతి చెందిన అబ్బాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.