
శ్రీలంకలోని చెమ్మాణిలో తవ్వకాలు చేస్తుంటే మట్టి కింద దాగిన డార్క్ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అక్కడ దొరికినవి చూస్తే నిజంగా గూస్బంప్స్ వస్తాయి! ఏకంగా 582 మానవ అస్థిపంజరాలు వెలుగుచూశాయి. ఎముకల కుప్పల మధ్య చిన్నపిల్లల పాల సీసాలు, ఆటబొమ్మలు, స్కూల్ బ్యాగులు, గాజులు దొరికాయి. అసలు ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతుంది! ఒక అస్థిపంజరానికి అయితే చేతులు ఛాతీపైకి గట్టిగా కట్టేసి ఉన్నాయట. అంటే ఎంత దారుణంగా ప్రాణాలు తీసారో అర్థం చేసుకోవచ్చు. శ్రీలంకలో ఒకప్పుడు సైన్యానికి, ఎల్టీటీఈకి మధ్య జరిగిన భీకర సివిల్ వార్ టైమ్లో ఆచూకీ లేకుండా పోయిన అమాయక పౌరుల మృతదేహాలే ఇవని భావిస్తున్నారు. దశాబ్దాలుగా ఎవరికీ తెలియని ఈ దారుణ నిజాలు ఇప్పుడు బయటపడటంతో అందరూ షాక్ అవుతున్నారు. హిస్టరీ ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక పెద్ద ఎగ్జాంపుల్!
పాల సీసాలు, ఆటబొమ్మలు… కలచివేస్తున్న దృశ్యాలు!
తవ్వకాల తర్వాత కనిపించిన దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. చిన్న పిల్లలు, పసికందుల అస్థిపంజరాలు కూడా అక్కడ బయటపడ్డాయి. పాల సీసాలు, ఆటబొమ్మలు, స్కూలు బ్యాగులు, చిన్నారుల చెప్పులు, గాజులు దొరికాయి. 1995లో జాఫ్నా ప్రాంతం శ్రీలంక సైన్యం ఆధీనంలోకి వచ్చింది. అప్పటినుంచి యుద్ధం ముగిసే వరకు సైన్యం జరిపిన అరాచకాలకు అంతేలేకుండా పోయింది. 1998లో విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో విచారణ ఎదుర్కొన్న శ్రీలంక సైనికుడు… సైన్యం తన కస్టడీలో ఉన్న దాదాపు 400 మంది తమిళులను ఊచకోత కోసి చెమ్మానిలో పాతిపెట్టిందని వెల్లడించాడు. దాంతో సామూహిక సమాధుల ప్రాంతంగా చెమ్మాని అప్పట్లో ప్రచారంలో ఉండేది. 1999లో తొలిసారి ప్రభుత్వం జరిపిన తవ్వకాల్లో 15 అస్థిపంజరాలు దొరకగా వాటిపై తీవ్ర గాయాల గుర్తులు ఉన్నట్లు తేల్చారు. అయితే ఆ తర్వాత నిధుల కొరతతో విచారణను ప్రభుత్వం నిలిపివేసింది. ఇటీవల ఒక హిందూ శ్మశానవాటిక సమీపంలో నిర్మాణ కార్మికులకు అస్థికలు కనిపించడం కలకలం రేపింది. ప్రభుత్వం సుమారు రూ. 62 లక్షల నిధులతో తవ్వకాలు చేపట్టింది. గత ఏడాది ఇదే ప్రాంతంలో 240 అస్థిపంజరాలు బయటపడగా, ప్రస్తుతం 582 లభించడం గమనార్హం.
లక్ష మందిని బలిగొన్న యుద్ధం!
1983లో ప్రారంభమైన అంతర్యుద్ధంలో ప్రభుత్వ దళాలకు ఎల్టీటీఈకి మధ్య జరిగిన పోరులో లక్ష మందికి పైగా మరణించారు. దశాబ్దాల నాటి యుద్ధం ఎల్టీటీఈ ఓటమితో ముగిసినప్పటికీ… వేలాది మంది తమిళ పౌరులు ఆచూకీ లేకుండా పోయారు. శ్రీలంక సైనిక దళాలతో పాటు ఎల్టీటీఈ కూడా అపహరణలు, హత్యలకు పాల్పడిందనే ఆరోపణలు వినిపించాయి. దశాబ్దాల జాప్యం తర్వాత బయటపడ్డ అస్థిపంజరాలు నాటి యుద్ధ నేరాల దారుణాన్ని మరోసారి ప్రపంచం కళ్లకు కట్టింది!