
Ajinkya Rahane Emotional Post to Fans: టీమిండియా టెస్టు క్రికెట్లో స్టార్ బ్యాటర్లలో ఒకరైన అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. 38 ఏళ్ల రహానే.. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. 2023లో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత అతడు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ‘క్యాప్ 278 సైనింగ్ ఆఫ్’ అనే క్యాప్షన్తో భావోద్వేగ వీడియోను షేర్ చేస్తూ.. రహానే తన కెరీర్కు ముగింపు పలికాడు.
ఆట కోసం అన్నీ అర్పించా:
జీవితంలో ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంటుందని, ఆ సమయం వచ్చినప్పుడు దానిని గౌరవించి ముందుకు సాగాల్సిందేనని రహానే తన సందేశంలో పేర్కొన్నాడు. ‘బ్యాటింగ్లో సరైన టైమింగ్ను నేను ఎప్పుడూ నమ్మాను. అదే విధంగా ఇప్పుడు కూడా ముందుకు సాగే సరైన సమయం వచ్చిందని భావిస్తున్నాను. అందుకే అంతర్జాతీయ క్రికెట్తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నాను. ఆట కోసం నా శక్తి మేరకు అన్నీ అర్పించాను. నాకు వచ్చిన ప్రతి అవకాశం, ప్రతి ఇన్నింగ్స్లో దేశం కోసం ఆడాలనే తపనతోనే మైదానంలోకి దిగాను. నా వ్యక్తిగత ప్రయోజనాల కంటే.. దేశం, జట్టునే ముందుగా ఉంచాను. నిజాయితీతో ఆడితే క్రికెట్ ఎప్పుడూ మనకు తగిన ఫలితం ఇస్తుందనే నమ్మకంతో సాగాను’ అని రహానే చెప్పాడు.
క్రికెట్తో నా అనుబంధం కొనసాగుతుంది:
‘నా కెరీర్లో భారత క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందడాన్ని ప్రత్యక్షంగా చూశా. గత 20 ఏళ్లుగా ఆ ప్రయాణంలో భాగమవడం గర్వకారణం. భారత క్రికెటర్గా నా అధ్యాయం ముగిసినా.. క్రికెట్తో నా అనుబంధం కొనసాగుతుంది. యువతకు మార్గనిర్దేశం చేస్తూ, ఆట నాకు నేర్పిన విలువలను తదుపరి తరానికి అందించేందుకు కృషి చేస్తా. ముంబై తరఫున తొలి అడుగుల నుంచి భారత జట్టు వరకు నా ప్రయాణంలో సహకరించిన బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్, సహచర ఆటగాళ్లు, కోచ్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నా భార్య రాధిక, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అభిమానుల ప్రేమను ఎప్పటికీ మరచిపోలేను’ అని జింక్స్ చెప్పాడు.
ఎన్నో ఓటములను చూపించింది:
‘అజింక్య అంటే ఓడిపోనివాడు. కానీ క్రికెట్ నాకు ఎన్నో ఓటములను చూపించింది. ఆటగాడిగా ఎన్నో తప్పులు చేశాను, జట్టు కూడా ఓడిపోయింది. అయినప్పటికీ ఒక చోట మాత్రం నేను ఎప్పుడూ ఓడిపోలేదు. అది అభిమానుల హృదయాల్లో. మీరు ఎప్పుడూ నన్ను మీ కుటుంబ సభ్యుడిలా ఆదరించారు. మీ ప్రేమ, నమ్మకం, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు. క్యాప్ నంబర్ 278.. సైన్ ఆఫ్’ అంటూ రహానే భావోద్వేగం చెందాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రహానే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ గైర్హాజరీలో గాయాలతో సతమతమవుతున్న జట్టును నడిపిస్తూ ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందించడం అతని కెరీర్లోనే కీలక మైలురాయిగా నిలిచింది. మెల్బోర్న్ టెస్టులో శతకంతో జట్టును విజయపథంలో నడిపించిన రహానే నాయకత్వం భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.