
హర్యానాలో కేవలం ఒకే ఒక్క పానీపూరీ కోసం జరిగిన వివాదం.. రెండు దశాబ్దాల క్రితం మొదలై ఏకంగా 12 ఏళ్లపాటు కోర్టు మెట్లు ఎక్కడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆస్తులు, ఆర్థిక గొడవలతో కోర్టులు నిండిపోతున్న ప్రస్తుత కాలంలో, ఐదు రూపాయల పానీపూరీ వివాదం న్యాయస్థానం వరకు వెళ్లడం వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది.
ఏం జరిగిందంటే..
హరియాణాలోని ఒక ప్రాంతంలో 2014లో ఈ విచిత్రమైన ఘటన జరిగింది. ఒక సాయంత్రం వేళ స్థానికంగా ఉండే ఓ వ్యక్తి పానీపూరీ తినడానికి బజారుకు వెళ్లారు. అక్కడ ఒక బండి వ్యాపారి ఐదు రూపాయలకు కేవలం నాలుగు పానీపూరీలు మాత్రమే ఇచ్చాడు. చుట్టుపక్కల అందరూ ఐదు రూపాయలకు ఐదు పానీపూరీలు ఇస్తుంటే, నువ్వు నాలుగే ఎందుకు ఇస్తున్నావని సదరు కస్టమర్ ప్రశ్నించాడు. దీనికి అతడు దురుసుగా సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు…
చిన్నగా మొదలైన ఈ వాగ్వాదం కాస్తా పరస్పర దాడులు, ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసులు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అలా ఈ ‘పానీపూరీ కేసు’ న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణకు దారితీసింది.
12 ఏళ్ల విచారణ.. 15 మంది సాక్షులు..
ఈ చిన్న గొడవను తేల్చడానికి కోర్టుకు ఏకంగా 12 ఏళ్ల సమయం పట్టింది. ఈ కాలంలో ఇరు పక్షాల తరఫున దాదాపు 15 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. అనేక వాయిదాలు, వాదనల తర్వాత.. ఈ గొడవకు సంబంధించి ఇరు వర్గాల వద్ద సరైన, బలమైన ఆధారాలు లేవని కోర్టు నిర్ధారించింది. చివరకు ఈ మధ్యే న్యాయమూర్తి ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.
సమయస్ఫూర్తి, సహనం లేకపోతే చిన్న విషయాలు కూడా ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ పానీపూరీ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. చిన్నపాటి పట్టు విడుపులతో పరిష్కారం కావలసిన ఈ వివాదం, పట్టుదలల కారణంగా 12 ఏళ్ల విలువైన సమయాన్ని, కోర్టు సమయాన్ని వృధా చేసింది. ఇది తెలుసుకున్న నెటిజన్లు కూడా ఏందిరా ఇది.. ఒక్క పానీ పూరీ కోసం 12 ఏళ్లుగా ఎదురు చూశాడా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.