Reading Time: 2 minutes
Womens T20 World Cup : సొంతగడ్డపై ఇంగ్లాండ్ అజేయ రికార్డ్.. ఆతిథ్య దేశానికే కలిసొచ్చే సెంటిమెంట్

Womens T20 World Cup : మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. క్రికెట్ మక్కాగా పిలవబడే లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆదివారం జరగబోయే ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఆతిథ్య ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సాంప్రదాయ ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లూ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా ఫైనల్‌కు దూసుకురావడం విశేషం. ఇది మహిళా టీ20 ప్రపంచకప్ చరిత్రలో 10వ ఫైనల్ మ్యాచ్ కావడం మరొక ప్రత్యేకత.

హెడ్-టు-హెడ్ రికార్డులు ఏం చెబుతున్నాయి?

మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడటం ఇది 46వ సారి. గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే ఆస్ట్రేలియా జట్టు స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు జరిగిన 45 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా 23 సార్లు విజయం సాధించగా, ఇంగ్లాండ్ 21 మ్యాచ్‌లలో జయకేతనం ఎగురవేసింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అయితే ప్రపంచకప్ టోర్నమెంట్ల విషయానికి వస్తే, ఇరు జట్లూ ఇప్పటివరకు 7 సార్లు తలపడగా అందులో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌లు, ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ముఖ్యంగా ఫైనల్స్ లో మూడుసార్లు ఈ రెండు జట్లు తలపడగా, ఆ మూడుసార్లూ ఆస్ట్రేలియానే విజయం వరించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

సొంతగడ్డపై ఇంగ్లాండ్ అజేయ రికార్డ్

ఇంగ్లాండ్ జట్టుకు తమ సొంతగడ్డపై ఆడుతుండటం ఒక పెద్ద సానుకూల అంశం. టీ20 ప్రపంచకప్ చరిత్రలో 2009 ఎడిషన్ నుంచి ఇప్పటివరకు ఇంగ్లాండ్ తమ స్వదేశంలో ఆడిన మొత్తం 11 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది. అంతేకాదు, ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు ఆతిథ్యం ఇచ్చిన అన్ని రకాల మహిళల ప్రపంచకప్‌లలో (వన్డే, టీ20) తానే విజేతగా నిలిచిన అద్భుతమైన చరిత్ర ఉంది. కాబట్టి ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేసి టైటిల్ కొట్టాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలిస్తే 7వ సారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుంది, అదే ఇంగ్లాండ్ గెలిస్తే 2009 తర్వాత మళ్లీ ట్రోఫీని ముద్దాడుతుంది.

ఛాంపియన్‌గా నిలిస్తే రూ.22 కోట్ల భారీ ప్రైజ్ మనీ

ఈ మెగా టోర్నమెంట్‌లో విజేతగా నిలిచే జట్టుకు ఐసీసీ భారీ నజరానా ప్రకటించింది. ఫైనల్ గెలిచి ట్రోఫీని కైవసం చేసుకున్న జట్టుకు చాంపియన్ కప్‌తో పాటు ఏకంగా 2.34 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.22 కోట్లకు పైగా) ప్రైజ్ మనీ లభిస్తుంది. అలాగే రన్నరప్‌గా నిలిచి తృటిలో టైటిల్ చేజార్చుకున్న జట్టు కూడా ఖాళీ చేతులతో వెళ్లడం లేదు. రన్నరప్ జట్టుకు 1.17 మిలియన్ డాలర్లు (సుమారు రూ.11 కోట్లు) నగదు బహుమతిగా అందుకోనుంది. మహిళల క్రికెట్‌లో ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఇవ్వడం ఇదే మొదటిసారి.

ఫైనల్ వరకు సాగిన ఇరు జట్ల అజేయ ప్రయాణం

ఈ టోర్నీలో రెండు జట్లూ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వచ్చాయి. ఆస్ట్రేలియా తన గ్రూప్ స్టేజ్‌లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, భారత్‌లపై ఘనవిజయాలు సాధించి, సెమీఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించింది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్‌లను ఓడించి, సెమీస్‌లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఈ రెండు అత్యంత బలమైన జట్ల మధ్య జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం అవుతుంది. అంతకంటే అరగంట ముందు, అంటే రాత్రి 7:30 గంటలకు టాస్ వేస్తారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..