Reading Time: 3 minutes
Peddi Ki Aawaz Ram Charans Grand Bhopal Event With Ar Rahman Live Performance

Ram Charan’s PEDDI Ki Aawaz Event at Bhopal: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్ లాంచ్ చేయగా.. బ్యాట్ పట్టుకొని చరణ్ చేసిన రచ్చ సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ అభిమానుల కోసం మరో భారీ ఈవెంట్‌ను ప్రకటించింది. ‘#PEDDIKiAawaz’ పేరుతో నిర్వహించనున్న ఈ స్పెషల్ ఈవెంట్ మే 23న భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ దసరా మైదాన్‌లో సాయంత్రం 5 గంటల నుంచి గ్రాండ్‌గా జరగనుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన చరణ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేత, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు పెద్ది చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా ఈ ఈవెంట్‌లో లాంచ్ చేయబోతున్నారు. ఈ అద్భుతమైన మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను లైవ్‌లో చూసేందుకు భోపాల్ సిద్ధంగా ఉండాలంటూ.. చరణ్ తెలిపారు. పెద్ది స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్‌, చరణ్‌ అదిరిపోయే స్టెప్పులేసినట్టుగా తెలిసింది. ఈ పాటలో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా కనిపించనుంది. రెహమాన్ ఇచ్చిన మాస్‌ బీట్‌కు థియేటర్ టాపులు లేచిపోవడం గ్యారెంటీ అంటున్నారు. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెహమాన్ సంగీతం, లైవ్ షో ఈ ఈవెంట్‌కు మరింత హైలైట్ కానున్నాయి.

ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘PEDDIKiAawaz’ ఈవెంట్‌తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి అభిమానుల అంచనాలను పెద్ది అందుకుంటుందో లేదో. ‘గేమ్ ఛేంజర్’తో భారీ ఫ్లాఫ్ ఖాతాలో వేసుకున్న చరణ్.. పెద్ది పైనే ఆశలు పెట్టుకున్నాడు.