
పంజాగుట్ట, వెలుగు: కారులో లిఫ్ట్ అడిగి కూర్చున్న ఓ వ్యక్తి రూ.3 లక్షల నగదుతో పరారయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎం.శివకుమార్ అనే వ్యక్తి నల్గొండ వెళ్లి శుక్రవారం తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కు వస్తుండగా నగర శివారులో ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. తన పేరు రాహుల్ అని పరిచయం చేసుకున్నాడు. శివకుమార్ అతడిని కారులో ఎక్కించుకున్నాడు.
కారు పంజాగుట్టలోని ఎర్రమంజిల్ ప్రాంతానికి చేరుకోగా శివకుమార్ ఓ కేఫ్లో టీ తాగేందుకు దిగాడు. రాహుల్ తనకు టీ తాగే అలవాటు లేదని చెప్పడంతో అతడిని కారులోనే ఉంచి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చేసరికి రాహుల్ కనిపించలేదు. కారులో ప్లాస్టిక్ కవర్లో ఉంచిన రూ.3 లక్షల నగదు కూడా మాయమైనట్లు గుర్తించాడు. దీంతో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.