
ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం రేపు ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు ఇనాగరేషన్ వేడుకలతో ఉత్తరాంధ్ర ఊగిపోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లుచేసింది రాష్ట్రప్రభుత్వం.
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవవేళ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. దేశ మౌలిక వసతుల్లో భోగాపురం విమానాశ్రయం ఒక బిగ్గెస్ట్ బూస్ట్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ద్వారా.. పర్యాటకం, వాణిజ్యం అభివృద్ధి చెందుతుందని.. వికసిత భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పోస్ట్పై స్పందించిన సీఎం చంద్రబాబు.. స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రిప్లై ఇచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టుతో అభివృద్ధిలో ఉత్తరాంధ్ర టేకాఫ్ తీసుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు.
ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రారంభోత్సవ సభకు 3 లక్షల మంది వస్తారన్న అంచనా 5వేల బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే, 7వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. భోగాపురంలో ప్రధాని మోదీ ల్యాండైన తర్వాత 13వేల మందికిపైగా గిరిజన బాలికల థింసా నృత్యంతో స్వాగత ఏర్పాట్లుచేసింది ప్రభుత్వం. ఈ థింసా నృత్యానికి ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు మంత్రి సంధ్యారాణి.
శనివారం (ఆగస్టు 01) ఉదయం పదకొండున్నర తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ. ఉదయం 10:45కి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకుని.. 10:55 వరకు టెర్మినల్ని పరిశీలిస్తారు. పదకొండూ 17 నిమిషాలకు ఓపెన్టాప్ జీప్లో ర్యాలీగా బయల్దేరి పది నిమిషాల్లో సభా వేదిక దగ్గరకు చేరుకుంటారు. పదకొండున్నర తర్వాత ఎయిర్పోర్ట్ను ప్రారంభించి, మాట్లాడతారు ప్రధాని. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైనా.. పూర్తిస్థాయి ఆపరేషన్స్ మాత్రం ఆగస్ట్ 17 నుంచి మొదలుకానున్నాయ్. ఆరోజు నుంచే భోగాపురం గగనతలంలో విమానాల మోత మోగనుంది.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విశాఖవాసులకు సూచించారు. మూడు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..