
BJP Bengal Win: పశ్చిమ బెంగాల్ సరిహద్దు నియోజకవర్గాల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. చాలా చోట్ల బంఫర్ మెజారిటీలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. సరిహద్దుల్లోని ప్రజలు తమను రక్షించే పార్టీగా బీజేపీని భావించినట్లు తెలుస్తోంది. దీనికి బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం కూడా ఉంది. ముఖ్యంగా, బంగ్లాదేశ్లో పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మతోన్మాద సంస్థ జమాతే ఇస్లామీ ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో 17 సరిహద్దు నియోజకవర్గాల్లో జమాత్ ఇటీవల బంగ్లా ఎన్నికల్లో గెలిచింది. రంగ్పూర్, కురిగ్రామ్, నిల్ఫమారి, జెస్సోర్, సాత్ఖిరా వంటి ప్రాంతాల్లో జమాత్ ప్రభావం పెరగడం అక్కడి రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది.
Read Also: PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
తాజాగా జరిగిన బెంగాల్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. కనీసం 26 సీట్లను గెలుచుకుంది. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, మాల్దా, ఉత్తర దినాజ్ పూర్, దక్షిణ దినాజ్ పూర్, జల్పాయిగురి, కూచ్బెహార్ వంటి జిల్లాల్లో బీజేపీ బలమైన ప్రదర్శన చేసింది. బీజేపీ ఎన్నికల ప్రచారంలో అక్రమ చొరబాట్లు, బంగ్లాదేశ్ హిందువులపై దాడుల వంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. షేక్ హసీనా తప్పుకున్న తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరిగాయి. అయితే, ఈ దాడులపై టీఎంసీ ఏనాడు మాట్లాడలేదు. బీజేపీ మాత్రం వీటిని పదే పదే ఎన్నికల సభల్లో ప్రస్తావించింది.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై సువేందు అధికారి పలు సందర్భాల్లో భారీ నిరసనలు చేపట్టారు. కోల్కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ముస్లిం జనాభా సరిహద్దుల్లో జనాభా స్వరూపాన్ని మార్చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లోని ప్రజలు బీజేపీకి విజయాన్ని కట్టబెట్టారు. బెంగాల్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో జమాత్ ఎదుగుదల కూడా బీజేపీ ఎదుగుదలకు కారణంగా కనిపిస్తోంది.