ఆ ముగ్గురు దద్దమ్మలు ఇక ఇంటికే.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన పులి.. కోహ్లీ దోస్త్ గ్రాండ్ ఎంట్రీ?

Rajat Patidar Asian Games 2026: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస పరాజయాలతో టీమిండియా టీ20 జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని మేనేజ్మెంట్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి నిఘా ఉంచింది. జింబాబ్వే పర్యటన ముగిసిన వెంటనే చైనా వేదికగా జరగబోయే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు 2026పై అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే ప్రకటించిన ఆసియా క్రీడల జట్టులో కొన్ని కీలక మార్పులు చేసేందుకు అనుమతించాలని నిర్వాహకులను బీసీసీఐ కోరనున్నట్లు సమాచారం. ఈ మార్పుల ద్వారా ఐపీఎల్లో వరుసగా రెండు టైటిళ్లు అందించి అద్భుత ఫామ్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్కు జట్టులోకి వచ్చేందుకు లైన్ క్లియర్ కానుంది.
మిడిలార్డర్ సంక్షోభానికి అసలైన విరుగుడు పాటిదార్..!
ప్రస్తుతం భారత టీ20 జట్టు మధ్య వరుస బ్యాటింగ్లో తీవ్రమైన నిలకడలేమితో ఇబ్బంది పడుతోంది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు ఇన్నింగ్స్ను నిలబెట్టే బలమైన కుడిచేతి వాటం బ్యాటర్ కోసం అన్వేషణ సాగుతోంది. ఈ స్థానానికి రజత్ పాటిదార్ అత్యంత ఖచ్చితమైన ఎంపికగా కనిపిస్తున్నాడు. గత రెండేళ్లుగా ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లో పాటిదార్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో ఆర్సీబీని ఛాంపియన్గా నిలబెట్టిన అతను, ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ టీ20 లీగ్లో 8 ఇన్నింగ్స్ల్లో 198.70 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 306 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఐపీఎల్లో 3వ నంబర్లో 152 స్ట్రైక్ రేట్తో, 4వ నంబర్లో 173 స్ట్రైక్ రేట్తో ఆడిన రికార్డు అతనికుంది. స్పిన్, పేస్ బౌలింగ్ను సమానంగా ఎదుర్కొనే పాటిదార్ కోసం ముగ్గురు ఆటగాళ్లపై వేటు పడే అవకాశం ఉంది.
తెలంగాణ స్టార్ తిలక్ వర్మపై ఒత్తిడి..!
జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పటికీ, ఇటీవల ముగిసిన బ్రిటన్ పర్యటనలో తిలక్ వర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలు కలిపి 6 ఇన్నింగ్స్ల్లో కేవలం 25 సగటుతో 125 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 113.63గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఓపెనర్లు త్వరగా అవుటైనప్పుడు మిడిలార్డర్లో ఇన్నింగ్స్కు స్థిరత్వం ఇవ్వడంలో తిలక్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతని స్థానంలో మూడో లేదా నాలుగో స్థానంలో వేగంగా ఆడగల రజత్ పాటిదార్ను తీసుకురావాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఫామ్ లేమితో సంజూ శాంసన్ అవుట్..?
ఆసియా క్రీడల రేసు నుంచి తప్పుకునే ప్రమాదంలో ఉన్న మరో సీనియర్ ఆటగాడు సంజూ శాంసన్. ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ20లో కేవలం ఒకే ఒక్క పరుగుకే అవుటైన సంజూ, ఆ తర్వాత తుది జట్టులో స్థానం కోల్పోయాడు. అంతకుముందు ఐర్లాండ్ పర్యటనలోనూ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 5 పరుగులే చేశాడు. జట్టులో ఇషాన్ కిషన్ ప్రధాన వికెట్ కీపర్గా ఉండటం, ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ స్థానాలు దాదాపు ఖాయం కావడంతో సంజూకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. కాబట్టి అదనపు బ్యాటింగ్ బలం కోసం సంజూ స్థానంలో పాటిదార్ను చేర్చడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్
వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండ్ వైఫల్యం.. మారనున్న లెఫ్ట్-రైట్ కాంబినేషన్..
ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫామ్ కూడా జట్టుకు పెద్ద మైనస్గా మారింది. ఐర్లాండ్లో ఆడిన ఒక మ్యాచ్లో 9 పరుగులు, ఇంగ్లాండ్తో జరిగిన నాల్గో టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ప్రస్తుతం భారత బ్యాటింగ్ లైన్అప్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మినహా టాప్-7లో అందరూ ఎడమచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు. ఈ అతి పెద్ద లోపాన్ని సవరించడానికి రజత్ పాటిదార్ వంటి నాణ్యమైన కుడిచేతి వాటం బ్యాటర్ జట్టుకు ఎంతో అవసరం. గత కొన్ని మ్యాచ్లుగా లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం హర్షిత్ రాణాను, శివమ్ దూబేను ఆర్డర్ మార్చి పంపడం వల్ల జట్టులో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళానికి పాటిదార్ రాకతో తెరపడవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..