
ఏదైనా ప్రకృతి విపత్తులు వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ అప్రమత్తం చేయడం ప్రభుత్వాలకు సవాల్ గా మారుతుంది. ప్రస్తుతం దేశంలో టెలికమ్యూనికేషన్స్ శాఖ విపత్తుల సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. అంది వచ్చిన ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని ఇంకా మెరుగైన పద్ధతుల్లో సత్వరంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పద్ధతిని అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా సాచెట్’ (SACHET) అనే కొత్త సిస్టం తయారు చేసింది. ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కలిసి ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి.
మే 2న దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. మొబైల్కు ఒక మెసేజ్ వస్తుంది. దాంతో పాటు పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఇది కేవలం ఒక ‘టెస్ట్’ మాత్రమే. కాబట్టి ఈ మెసేజ్ లేదా శబ్దం చూసి మీరు ఏమీ చేయక్కర్లేదు. ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది.
ఈ సరికొత్త సాచెట్ అనే కొత్త సిస్టం పనితీరును శనివారం దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా సైరన్ శబ్దంతో పరీక్షించనున్నారు. ఈ సైరన్ ద్వారా ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో వేలమందికి సత్తర సమాచారం చేరనుంది. వరదలు లేదా తుఫానులు వచ్చే ముందు హెచ్చరికలు పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ అలర్ట్ మెసేజ్, సైరన్ శబ్దం వెళ్లేలా ఈ టెక్నాలజీని రూపొందించారు.
శనివారం మీ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నా కూడా ఈ సైరన్ వినిపించే అవకాశం ఉంది. మీ ఫోన్లో సైరన్ మోగినా లేదా ఎమర్జెన్సీ అలర్ట్ అని మెసేజ్ వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది కేవలం ప్రభుత్వం చేస్తున్న చిన్న టెస్టింగ్ అని మాత్రమే గుర్తించాలని కేంద్రం తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.