
మే 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కేజీల సిలిండర్ ధరను భారీగా పెంచింది. ఏకంగా ఒకేసారి రూ.వెయ్యి వరకు పెంచింది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ ధరతో పాటు సామాన్యులకు షాకిచ్చేలా కేంద్రం మరో నిర్ణయం కూడా తీసుకుంది. వలస కార్మికులు, విద్యార్థుల కోసం తీసుకొచ్చిన 5 కేజీల చిన్న సిలిండర్ ధరలను కూడా ఇవాళ కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత నెలలో పెంచగా.. ఈ నెలలో కూడా వీటి ధరలను పెంచింది. దీంతో సామాన్యులకు షాక్ తగిలినట్లయింది.
5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ(FTL) సిలిండర్ల ధరను రూ.261 మేర పెంచారు. మే 1వ తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. గత నెలలో కూడా చిన్న సిలిండర్ల ధరను పెంచారు. ఏప్రిల్ 1న రూ.51 పెంచగా.. ఇప్పుడు రూ.261 పెంచారు. దీని వల్ల వలస కార్మికులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ పెంపు తర్వాత వివిధ ప్రాంతాల్లో 5 కిలోల సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
5 కిలోల సిలిండర్ ధరలు..
-ముంబైలో 5 కేజీల ఎక్స్ట్రాలైట్ ఎల్పీజీ సిలిండర్ ధర నింపినది రూ.339గా ఉంది.
-ముంబైలో5 కేజీల డొమెస్టిక్ సిలిండర్ నింపినది రూ.798గా ఉంది
-ముంబైలో5 కేజీల ఎఫ్టీఎల్ దేశీయేత సిలిండర్ ధర రూ.1757గా ఉంది.
-ఢిల్లీలో 5 కేజీల ఎక్స్ట్రాలైల్ సిలిండర్ ధర రూ.339గా ఉంది
-ఎక్స్ట్రాలైట్ ఎఫ్టీఎల్ సిలిండర్ ధర రూ.3,363గా ఉంది.
-5 కిలోల సిలిండర్ ధర తక్కువ అయినప్పటికీ.. గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలను బట్టి ధరలు మారుతూ ఉంటాయి
5 కిలోల సిలిండర్ను ఎలా పొందాలి..?
ఒక ప్రదేశం నుంచి మరోక ప్రదేశానికి వెళ్లేవారికి, రూమ్స్లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులకు ఈ సిలిండర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ సిలిండర్ తీసుకునేందుకు కేవలం ఏదైనా గర్తింపు పత్రం సమర్పించే సరిపోతుంది. ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. భారత్ పెట్రోలియం భారత్ గ్యాస్ మినీ, ఇండియన్ ఆయిల్ ఇండేన్ చోటు పేరుతో ఈ చిన్న సిలిండర్లను తీసుకొచ్చాయి. ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఏదైనా చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ గుర్తింపు పత్రం గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి తీసుకెళ్లి ఈ గ్యాస్ వెంటనే పొందవచ్చు. అలాగే రీఫిల్లింగ్ కోసం బుకింగ్ చేసుకోవాల్సిన పనిలేదు. సమీపంలోని దుకాణాలు, పెట్రోల్ బంకులు, అవుట్ లెట్లలో ఫిల్ చేసుకోవచ్చు.