
సీఎం చంద్రబాబు తన పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్ను సందర్శించారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్వయంగా పేదలకు అల్పాహారం వడ్డించి.. వారితో పాటు కూర్చొని భోజనం చేయడం విశేషం. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఒకరోజు ఖర్చుగా రూ.76 లక్షలను భువనేశ్వరి విరాళంగా అందించారు. ఈ విరాళంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఆ రోజు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. అన్ని క్యాంటీన్లలో మూడు పూటలా అన్నదానం నిర్వహించనున్నారు.
సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పటమట అన్న క్యాంటీన్ వద్ద భారీ సందడి నెలకొంది. క్యాంటీన్ వద్దకు ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ‘హ్యాపీ బర్త్ డే సీఎం సార్’ అంటూ నినాదాలు చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేశారు. నేటితో చంద్రబాబు 76వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, మంత్రి నారా లోకేశ్ సహా హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషెష్ చెప్పారు.