Reading Time: < 1 minute
Supreme Court Rejects Netaji National Son Pil Ina Independence Claim

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్‌ను జాతీయ పుత్రుడిగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది. సుభాష్ చంద్రబోస్‌ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) వల్లే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని.. ఈ నేపథ్యంలో నేతాజీని ‘‘జాతీయ పుత్రుడిగా’’ ప్రకటించాలని, అలాగే 21 అక్టోబర్ 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపన, 23 జనవరి 1897 ( చంద్రబోస్ జయంతి)లను జాతీయ దినాలుగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారించింది. ఈ సందర్భంగా సూర్యకాంత్ మాట్లాడుతూ.. గతంలోనూ ఇలాంటి పిటిషన్లు దాఖలయ్యాయని.. అయినా ఇటువంటి విషయాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని.. సంబంధిత అధికార యంత్రాంగంతో చర్చించాలని పిటిషన్‌ను కొట్టేసిందని గుర్తుచేశారు. తాజా పిటిషన్ కూడా అలాంటిదేనని కొట్టేశారు.

కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని.. తిరిగి ఇదే పిటిషన్ రావడం పట్ల న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకపై భవిష్యత్‌లో కూడా ఇలాంటి పనికిమాలిన పిటిషన్లు దాఖలు చేయొద్దని పిటిషనర్‌కు సీజేఐ గట్టి వార్నింగ్ ఇచ్చారు. లేదంటే జరిమానాతో పాటు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాకుండా ఇకపై ఇలాంటి పిటిషన్లు స్వీకరించవద్దని రిజిస్ట్రీని ఆదేశించారు. ఇప్పుడు కోర్టు హాల్ నుంచి వెళ్లిపోవాలని.. లేకుంటే ఖర్చులు విధించాల్సి ఉంటుందని పిటిషనర్‌ను ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్రంగా హెచ్చరించారు.