
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ పేరుతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్లో భాగంగా 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పోలీసులు, 32 మంది బ్యాంకు అధికారులతో సహా మొత్తం 52 మంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు. ప్రధానంగా పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు, మరియు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అమాయకులను బెదిరించి దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కైన కొందరు బ్యాంకు అధికారులు, కేవైసీ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా సుమారు 350 ‘మ్యూల్ ఖాతాలను’ తెరిచి ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 850 కేసులతో సంబంధం ఉన్న రూ. 150 కోట్ల మేర భారీ సొమ్ము దారిమళ్ళినట్లు పోలీసులు గుర్తించారు.
Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్..
హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి. అరవింద్ బాబు, ఏసీపీ ఆర్.జి. శివ మారుతి నేతృత్వంలోని 16 ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు నిరంతరం శ్రమించి ఈ నెట్వర్క్ను తుదముట్టించాయి. ఈ దాడుల్లో ఐడీఎఫ్సీ, ఇండస్ఇండ్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రముఖ బ్యాంకులకు చెందిన మేనేజర్లు, కేవైసీ అప్రూవర్లు అరెస్ట్ కావడం గమనార్హం. నిందితుల నుంచి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మరియు 21 షెల్ కంపెనీల స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారులు కేవలం తమ లాభాల కోసం లేదా నిర్లక్ష్యం వల్ల నేరగాళ్లకు సహకరిస్తున్నారని, ఇది వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారిందని అధికారులు స్పష్టం చేశారు.
Viral : పంది కడుపున ‘ఏనుగు పిల్ల’.. విస్తుపోతున్న జనం.!
ఈ భారీ విజయంపై హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్ గారు మాట్లాడుతూ, సైబర్ నేరాల కట్టడిలో తాము ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తున్నామని, చట్టాన్ని అతిక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు కేవైసీ నిబంధనల విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజలు కూడా అధిక లాభాల పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని, డిజిటల్ అరెస్టుల వంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ‘1930’ నంబర్కు ఫిర్యాదు చేసి తమ సొమ్మును కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.