
HDFC & ICICI Bank Q4 Results: దేశంలోని అగ్రశ్రేణి ప్రైవేట్ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను సాధించాయి. హెచ్డిఎఫ్సి తన పట్టును నిలబెట్టుకోగా, ఐసిఐసిఐ బ్యాంక్ ఏకంగా రూ.50 వేల కోట్ల వార్షిక లాభాల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది.
READ ALSO: May 1 Releases : పెద్ది పోస్ట్ పోన్.. మేడే కోసం క్యూ కట్టిన సినిమాలు
హెచ్డిఎఫ్సి బ్యాంక్..
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్.. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.19,221 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో (రూ. 17,616 కోట్లు) పోలిస్తే ఇది 9.1 శాతం ఎక్కువ. ఈ బ్యాంకు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 10.9% పెరిగి రూ. 74,671 కోట్లకు చేరుకుంది. దీంతో బ్యాంకు డివిడెండ్ కోసం ఒక్కో షేరుకు రూ. 13 చొప్పున తుది డివిడెండ్ను బోర్డు సిఫార్సు చేసింది. దీనితో కలిపి ఏడాదికి మొత్తం డివిడెండ్ రూ.15.50కి చేరింది. ఈ బ్యాంక్ తాత్కాలిక ఛైర్మన్ కేకి మిస్త్రీ పదవీకాలాన్ని పొడిగించాలని యాజమాన్యం భావిస్తోంది. అలాగే బ్యాంకింగ్ ఉత్పత్తుల విక్రయాల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ జగదీశన్ స్పష్టం చేశారు.
ఐసిఐసిఐ బ్యాంక్
రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ సరికొత్త చరిత్ర సృష్టించింది. బ్యాంక్ వార్షిక నికర లాభం తొలిసారిగా రూ.50,000 కోట్ల మార్కును దాటి రూ. 50,146.6 కోట్లకు చేరింది. క్యూ4లో లాభం 8.5% పెరిగి రూ. 13,701.7 కోట్లుగా నమోదైంది. దీంతో డివిడెండ్ కోసం ఒక్కో షేరుకు రూ. 12 డివిడెండ్ను బ్యాంక్ ప్రకటించింది. మొండి బకాయిలు తగ్గడం బ్యాంక్ లాభాలకు ప్రధాన కారణం. ఇదే సమయంలో యస్ బ్యాంక్ కూడా అద్భుతమైన పురోగతి సాధించింది. నాలుగో త్రైమాసికంలో లాభం ఏకంగా 44.8% పెరిగి రూ.1,068 కోట్లుగా నమోదైంది. ఈ బ్యాంకు వార్షిక లాభం విషయానికి వస్తే.. ఏడాదికి మొత్తం లాభం రూ.3,476 కోట్లకు చేరింది. ఈ బ్యాంక్ కొత్త ఎండి & సీఈఓ వినయ్ తోన్సే బాధ్యతలు చేపట్టిన తర్వాత, లాభదాయకత, క్రమశిక్షణతో కూడిన విస్తరణపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ప్రకటించారు. జపాన్కు చెందిన SMBC పెట్టుబడులు బ్యాంక్ బలాన్ని మరింత పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తం మీద భారతీయ బ్యాంకింగ్ రంగం పటిష్టమైన స్థితిలో ఉందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు తమ మొండి బకాయిలను తగ్గించుకుంటూ భారీ లాభాల దిశగా దూసుకుపోతున్నాయి.
READ ALSO: Char Dham Yatra: హిమాలయాల్లో ఆధ్యాత్మిక శోభ.. తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ద్వారాలు!