
Punarvika: అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) వ్యాధితో బాధపడుతున్న పునర్వికకు ఇవాళ ఇంజెక్షన్ వేయనున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పునర్వికను బతికించాలని డొనేషన్స్ పేరుతో మహా యజ్ఞమే జరిగింది. ఎట్టకేలకు ప్రభుత్వం సైతం దిగి వచ్చింది. సోషల్ మీడియాలో వచ్చిన డోనేషన్తో పాటు ప్రభుత్వం సహాయం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ముందుకు వచ్చారు. ఇంజక్షన్ అమెరికా నుంచి హైదరాబాద్ తెప్పించడానికి సాయం చేశారు. ఇక ఇవాళ హైదరాబాద్లో మంత్రి లోకేష్ సమక్షంలో ఇంజక్షన్ ఇవ్వనున్నారు. రూ. 16 కోట్లలో రూ. 10 కోట్ల విరాళాలు సేకరించగా.. మిగిలిన రూ.6 కోట్లు సమీకరించారు. పుర్విక భవిష్యత్తుకు సైతం హామీ ఇచ్చారు.
ఇంతకీ ఆ 11 నెలల పాప ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాల మంగలి సురేశ్కుమార్, పుష్పావతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె పునర్వికశ్రీ 2025 మే 12న జన్మించింది. పునర్విక ఆరు నెలలైన తన శరీరాన్ని కదిలించలేక పోయింది. దీంతో కంగారు పడిన పేరెంట్స్ సమీప కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఆ డాక్టర్ల సిఫార్స్ మేరకు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పటల్కు తీసుకెళ్లారు.. చిన్నారిని పరిస్థితి, రిపోర్ట్స్ను పూర్తిగా పరిశీలించిన వైద్యులు అరుదైన సమస్యను గుర్తించారు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA)అనే జన్యుపరమైన సమస్య ఉందని స్పష్టం చేశారు. SMA అనేది వెన్నెముకలోని నరాల కణాలను (motor neurons) దెబ్బతీసే ఒక జన్యుపరమైన వ్యాధి. ఇది కండరాల బలహీనత, క్షీణతకు (atrophy) దారితీస్తుంది. ఈ వ్యాధి వల్ల నడక, శ్వాస, మింగడం, కదలికలు కష్టమవుతాయి. ఇది తరచుగా పిల్లలలో కనిపిస్తుంది. దీనికి న్యూసిన్సెన్, జోల్జెన్స్మా, రిస్డిప్లామ్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఒక్క ఇంజెక్షన్ విలువ రూ. 16 కోట్లు ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ద్వారా పునర్విక బతుకుతుందట. ఇక ఆ పాప బతకాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని ఓ ఇస్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ గతంలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో తెలుగు యువత ఒక్కసారిగా ముందుకు వచ్చింది. ప్రభుత్వం సైతం స్పందించడంతో పునర్విక ప్రాణం నిలబడింది.