Reading Time: < 1 minute
Smriti Irani Slams Congress Women Reservation Bill Failure Parliament Reaction

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో అధికార-ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధం నడుస్తోంది. విపక్షం విజయంగా భావిస్తుండగా.. అధికార పక్షం మహిళల హక్కులను హరించారంటూ మండిపడుతోంది.

దేశంలోని మహిళల హక్కులను హరించి సంబరాలు చేసుకుంటారా? అంటూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ మండిపడ్డారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య విజయం అని ప్రియాంకాగాంధీ ఎలా అంటారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ తలాక్ ఒక శాపంగా ఉండేదని వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ దేశంలోని మహిళలు దోపిడీకి గురవుతున్నారని అంటున్నారని.. ఆమె వాడిన భాష ఏ మాత్రం సరికాదన్నారు. అయినా దోపిడీ గురవుతున్నారనడానికి మహిళలు వస్తువులు కాదని హితవు పలికారు.

ఇది కూడా చదవండి: Kiren Rijiju: బిల్లు వీగిపోవడంపై సంబరాలు దురదృష్టకరం.. కాంగ్రెస్‌పై కిరణ్‌ రిజిజు ధ్వజం

ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 22 గంటల పాటు చర్చ చేపట్టిన తర్వాత ఓటింగ్ నిర్వహించింది. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోవడంతో బిల్లులు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం తెలిపింది.

ఇది కూడా చదవండి: Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్