Reading Time: < 1 minute
10th Class Result Date 2026: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 ఫలితాల తేదీలు చూశారా?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17: తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 13తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఓరియంగల్‌ పరీక్షలు ఏప్రిల్‌ 15, 16 తేదీల్లో ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్థులు రాశారు. ఇక పదో తరగతి మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచే ప్రారంభమైంది. ఏప్రిల్ 23వ తేదీతో ఈ మూల్యాంకన ప్రక్రియ పూర్తికానుంది. మూల్యాంకనం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అనంతరం మార్కుల నమోదు ప్రాసెస్‌ ప్రక్రియకు మరో పదో రోజుల సమయం పడుతుంది. మే మొదటి వారం నాటికి పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు.

కాగా గత ఏడాది ఏప్రిల్ 30న ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 30న లేదా మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంవత్సరం మొత్తం 5,28,239 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. ఇందులో 5.17 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు.

ఏపీలో పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే?

ఏపీలో ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ పరీక్షలు జరిగాయి. సరాసరి 99.05 శాతం మంది పరీక్షలకు హాజరైనట్లు పరీక్షల విభాగం సంచాలకులు తెలిపారు. ఇప్పటికే ఏపీలో మూల్యాంకనం ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు మూల్యాంకనం కొనసాగింది. మార్కుల ప్రాసెసింగ్‌ ప్రస్తుతం కొనసాగుతుంది. ఏపీలోనూ మే నెల మొదటి వారం నాటికి పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని పాఠశాల విద్యాశాఖ భావించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మే నెల మొదటి వారంలోనే పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు కసరత్తు చేస్తున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.