Reading Time: 2 minutes
Sushant Singh Rajput Sister Shweta Shares Emotional Tribute On His 6th Death Anniversary

ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారు. సుశాంత్ మరణం సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముంబైలోని తన నివాసంలో మృతదేహం లభించింది. నేటితో సుశాంత్ మరణించి ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, సోదరి శ్వేతా సింగ్ కీర్తి భావోద్వేగభరితమైన పోస్ట్ ద్వారా సోదరుడిని స్మరించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుశాంత్ ఫోటోలతో పాటు రాముడి రూపంలో ఉన్న ఒక చిత్రాన్ని పంచుకున్న శ్వేతా, తన సోదరుడు జీవితాన్ని ఎలా గడిపాడో, ప్రజల హృదయాల్లో ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోయాడో గుర్తు చేసుకున్నారు.

సోదరుడి జ్ఞాపకార్థం శ్వేత భావోద్వేగ సందేశం

సుశాంత్ ఆరవ వర్ధంతి సందర్భంగా శ్వేతా సింగ్ కీర్తి తన పోస్ట్‌లో ఇలా రాశారు.. “ఆరేళ్లు… చాలా కాలం గడిచిపోయింది. కానీ కొందరు కాలాన్ని మించిపోయే వ్యక్తులుగా నిలిచిపోతారు. ఇప్పుడు నేను నా సోదరుడి గురించి ఆలోచించినప్పుడు, అతను ఎలా వెళ్లిపోయాడో కాదు… అతను తన జీవితాన్ని ఎలా గడిపాడో గుర్తుకు వస్తుంది.” “జీవితం, నక్షత్రాలు, విశ్వం, మానవ మనస్సులోని రహస్యాల పట్ల అతనికి ఉన్న అపారమైన ఆసక్తి నాకు గుర్తుకొస్తుంది. ఎవరినైనా గౌరవంగా చూసే అతని పెద్ద మనసు గుర్తుకు వస్తుంది. దయ లేకుండా విజయం సాధించినా దానికి అర్థం లేదని మాకు నేర్పిన వ్యక్తి అతనే.”

“ప్రేమ కాలాన్ని అధిగమిస్తుంది”

శ్వేత తన సందేశంలో ప్రేమ గురించి కూడా హృదయాన్ని హత్తుకునే మాటలు చెప్పారు. “ప్రేమ కాల నియమాలను పాటించదు. శరీరం మన కళ్లముందు లేకపోయినా, ఒక అందమైన ఆత్మ ప్రభావం ఎన్నో జీవితాలపై శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎవరైనా కోపం కంటే దయను, అజ్ఞానం కంటే జ్ఞానాన్ని, నిరాశ కంటే ఆశను, తీర్పు కంటే ప్రేమను ఎంచుకున్న ప్రతిసారీ భాయ్ నిలబెట్టిన విలువలు సజీవంగా ఉంటాయి.”

“దయగా ఉండండి… నిర్భయంగా కలలు కనండి”

తన సందేశాన్ని ముగిస్తూ శ్వేత ఇలా పేర్కొన్నారు.. “భాయ్‌కు మనం ఇచ్చే గొప్ప నివాళి దుఃఖించడం కాదు. ఆయన నిలబెట్టిన విలువలను ఆచరించడమే. జిజ్ఞాసతో ఉండండి… దయతో ఉండండి… నేర్చుకుంటూ ఉండండి. నిర్భయంగా కలలు కనండి. వాటిని సాధించేందుకు కష్టపడండి. మీ హృదయాన్ని కఠినంగా మార్చేంత శక్తిని ఈ ప్రపంచానికి ఇవ్వకండి.”

“ఒక జీవితానికి నిజమైన కొలమానం అది ఎంతకాలం జీవించిందనేది కాదు… ఎన్ని హృదయాలను తాకిందనేదే. భాయ్ ఈ రోజుకీ ఆ ప్రమాణానికి తగ్గట్టుగానే జీవిస్తున్నారు. మీరు ఎప్పటికీ లక్షలాది మందికి స్ఫూర్తిగానే ఉంటారు. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తారు, గుర్తుంచుకుంటారు.”

2020 జూన్ 14న కన్నుమూసిన సుశాంత్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న, 34 ఏళ్ల వయసులో ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో మృతి చెందారు. సుశాంత్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. టెలివిజన్ రంగం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సుశాంత్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కై పో చె’, ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘చిచ్చోరే’, ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి’, ‘దిల్ బెచారా’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.

సుశాంత్ చివరిగా నటించిన చిత్రం ‘దిల్ బెచారా’. దర్శకుడు ముఖేష్ ఛబ్రా తెరకెక్కించిన ఈ చిత్రంలో సంజనా సంఘీ కథానాయికగా నటించారు. సుశాంత్ మరణానంతరం ఈ చిత్రం ఓటీటీ వేదికపై విడుదలై ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆలోచనలు, విలువలు, నటన, చిరునవ్వు కోట్లాది అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.