Reading Time: 2 minutes
Sonam Wangchuk Indira Park Hyderabad Protest Cockroach Janata Party Education Environment

sonam wangchuk: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వేదికగా నేడు ఒక వినూత్న నిరసన కార్యక్రమం జరిగింది. ‘కాక్రోజ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనామ్ వాంగ్‌చుక్ పాల్గొని, యువతను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. యువత దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, నాలాంటి వారు ఎల్లప్పుడూ మీకు మార్గనిర్దేశం చేస్తూ వెన్నంటి ఉంటారని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు విద్యాశాఖ మంత్రి అవ్వాలనో లేదా కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు, కోరికలు లేవని స్పష్టం చేశారు. కాక్రోజ్ జనతా పార్టీ అనేది కేవలం అధికారంలోకి రావడానికి ఉపయోగపడే రాజకీయ వేదిక కాదని, ఇది ప్రజలలో చైతన్యం తెచ్చే ఒక పవిత్రమైన ప్రయత్నమని పేర్కొన్నారు. యువతను మేల్కొల్పడమే లక్ష్యంగా సాగుతున్న ఒక స్వచ్ఛమైన ఉద్యమమని ఆయన అభివర్ణించారు. దేశంలో నిరంతరం వేధిస్తున్న పేపర్ లీకులు, పరీక్షల రద్దు వంటి సమస్యలకు ఇకనైనా ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు మంత్రి అయినా, చివరకు ప్రధానమంత్రి అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యను కేవలం పరీక్షలకే పరిమితం చేయకుండా, విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది రాబోయే తరాల భవిష్యత్తు కోసం బలమైన పునాది వేయాలని పిలుపునిచ్చారు.

విద్యా వ్యవస్థతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా అత్యంత ముఖ్యమని సోనామ్ వాంగ్‌చుక్ నొక్కి చెప్పారు. రాబోయే తరాలకు చదువు ఎంత అవసరమో.. వారు శ్వాసించడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి స్వచ్ఛమైన నీరు కూడా అంతే ముఖ్యమని గుర్తుచేశారు. ఈ విషయంలో హైదరాబాద్ ప్రజల పోరాటం దేశానికే ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. కేబీఆర్ (KBR) పార్క్ పరిరక్షణ కోసం ఇక్కడి ప్రజలు చేసిన ప్రచార కార్యక్రమాలు, భూమిని, నదులను కాపాడుకోవడానికి వారు నిలబడిన తీరును ఆయన అభినందించారు. ప్రభుత్వాల తీరును విమర్శిస్తూ.. అడవులను నరికివేసి కాంక్రీట్ భవనాలు, ఫ్లైఓవర్లు నిర్మిస్తే ప్రజలు సంతోషిస్తారనే తప్పుడు నమ్మకంలో పాలకులు ఉన్నారని, ఈ కాంక్రీట్ జంగిల్స్ మన పిల్లల భవిష్యత్తును కాపాడలేవని హితవు పలికారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. మన అడవులను, నదులను కాపాడుకోవడానికి ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి గొంతు విప్పినప్పుడే విజయం సాధ్యమవుతుందన్నారు. దీర్ఘకాలంలో మన విద్యను, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే.. స్వల్పకాలంలో మనకు ముందుగా ఒక క్రియాశీలకమైన, నిజాయితీగా పనిచేసే ప్రజాస్వామ్యం కావాలని సోనామ్ వాంగ్‌చుక్ ఆకాంక్షించారు.