Reading Time: 2 minutes

షాకింగ్ వీడియో.. లెబనాన్ గ్రామాలను మ్యాపులో కూడా కనబడకుండా పేల్చేసిన ఇజ్రాయెల్..

Caption of Image.

యుద్ధం కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న చమురు, గ్యాస్ సంక్షోభానికి పరిష్కారం చూపాలని ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి. ఎంతో కొంత మేరకు ఇరాన్-అమెరికా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పాటిస్తూ చర్చలు జరుపుతున్నాయి. అదే సమయంలో.. సీజ్ ఫైర్ లేదు.. తొక్క లేదు.. అన్నట్లుగా ఇజ్రాయెల్ దారుణంగా లెబనాన్ పై తెగబడింది. చర్చలు పరిష్కారం అయ్యేలోపు.. యుద్ధం ఆగేలోపే.. చెయ్యాలనుకున్న పని చేసెయ్యాలని భీకరమైన దాడులకు దిగింది. యుద్ధం క్లోజ్ అయ్యేలోపే లెబనాన్ ను తుడిచెపెట్టేయాలి అనుకున్న పథకాన్ని అమలు చేసి సక్సె్స్ అయ్యింది.

దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెల్ సృష్టించిన వీరంగానికి సంబంధించిన షాకింగ్ వీడియోలు బయటికి వచ్చాయి.  గత రెండు వారాలుగా, అమెరికా-ఇరాన్ మధ్య మిసైల్ దాడులు, శాంతి చర్చలు జరుగుతుండగా… ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ దక్షిణ సరిహద్దు గ్రామాలను పూర్తిగా నాశనం చేస్తూ వస్తోంది. గార్డియన్ పత్రిక రిపోర్ట్ ప్రకారం… ఇజ్రాయెల్ సైనికులు లెబనాన్ గ్రామాల ఇళ్లలో బాంబులు, పేలుడు పదార్థాలను రహస్యంగా అమర్చి… రిమోట్ కంట్రోల్ ద్వారా ఒకేసారి పెద్ద ఎత్తున పేల్చేశారు. పేల్చేస్తున్నారు. 

తయ్యిబా, నకౌరా, డైర్ సెర్యాన్ వంటి సరిహద్దు గ్రామాల్లో ఈ భారీ పేలుళ్లు జరిపారు. భీకర పేలుళ్లు జరిగినట్లు లెబనాన్ మీడియా నిర్ధారించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇస్రాయెల్ కాట్జ్… సరిహద్దు గ్రామాల్లోని అన్ని ఇళ్లనూ నాశనం చేయాలని ఆర్మీని ఆదేశించారు. దీంతో ఇజ్రాయెల్ గాజాను తుడిచేసినట్లు లెబనాన్ పై విరుచుకుపడింది.  గాజాలోని రఫా, బైత్ హనూన్ వంటి ప్రాంతాల్లో 90 శాతం ఇళ్లు ధ్వంసం చేసినట్లుగానే.. ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు రిపోర్ట్ పేర్కొంది.  హిజ్బుల్లా రాకెట్ దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సమర్థించుకుంది. 

►ALSO READ | అమెరికాలో విజయనగరం టెకీ మృతి.. మూడు నెలల క్రితమే జాబ్ వచ్చింది.. పాపం పుట్టిన రోజే..

హిజ్బుల్లా ఇరాన్ మద్దతుతో నడుస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అందుకే హిజ్బుల్లాను అంతం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్తోంది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి లెబనాన్‌లో 2,000 కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు… లెబనాన్‌తో  శాశ్వత శాంతి ఒప్పందం  కావాలని చెబుతున్నారు. కానీ హిజ్బుల్లా ఉంటే అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. అందుకే ఈ దాడులు అని చెబుతోంది. దక్షిణ లెబనాన్‌లో లిటాని నది వరకు ఆక్రమించుకుని  భద్రతా జోన్‌గా మార్చాలనే వ్యూహంలో  ఇజ్రాయెల్  ఉన్నట్లు తెలుస్తోంది. అందువలన అక్కడ గ్రామాలు లేకుండా.. మళ్లీ జనాలు నివసించలేని విధంగా దాడులకు దిగుతోందని అంటున్నారు.  హిజ్బుల్లా పేరు చెప్పి పౌరుల ఇళ్లను కావాలని ధ్వంసం చేయడం దారుణం అనే విమర్శలు వస్తున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.