
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కొర్రపాడు గ్రామ సమీపంలో డీజిల్ లోడుతో వెళ్తున్న ఓ భారీ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. అయితే ప్రమాదం కారణంగా డ్రైవర్ పరిస్థితి ఏంటని ఎవరూ పట్టించుకోకపోగా.. బకెట్లు, బిందెలతో డీజిల్కోసం ఎగబడ్డారు. ట్యాంకర్ బోల్తా పడి డీజిల్ కారిపోతుండటం గమనించిన స్థానికులు, ప్రమాద తీవ్రతను లెక్కచేయకుండా అక్కడికి చేరుకున్నారు. డీజిల్ కోసం బిందెలు, బకెట్లు, చెంబులు.. దొరికిన కాడికి పాత్రలు పట్టుకుని ఎగబడ్డారు. ఎక్కడో దూరంగా ఉన్నవారు కూడా సమాచారం అందగానే వాహనాలపై డబ్బాలతో ఆగమేఘాలమీద అక్కడ వాలిపోయారు. రోడ్డుపై ఏరులై పారుతున్న డీజిల్ను పట్టుకోవడానికి జనం పోటీ పడటంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. ఈ ట్యాంకర్ సత్తెనపల్లి వైపు నుండి గుంటూరు వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంధనం లీక్ అవుతున్న సమయంలో చిన్న నిప్పురవ్వ తగిలినా భారీ అగ్నిప్రమాదం జరిగి ఉండేది. కానీ, అవేమీ పట్టించుకోకుండా జనం ఇంధనం నింపుకోవడానికి ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, జనాలను చెదరగొట్టారు. ట్యాంకర్ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. రోడ్డుపై పారిన డీజిల్ వల్ల ఇతర వాహనాలు జారిపోయే ప్రమాదం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది రహదారిని శుభ్రం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారుల రక్తపు మరకల.. బ్యాగులతో చర్చలు
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్
భర్త నల్లగా ఉన్నాడని భార్య దారుణం.. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్తో డ్రామా
Aditya Dhar: ప్రభాస్ లెజెండ్ అంటూ.. ధురంధర్ డైరెక్టర్ క్రేజీ కామెంట్స్