
శివ్వంపేట, వెలుగు: బాల్య వివాహం చేసుకున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అచ్చంపేటకు చెందిన మైనర్ తల్లిదండ్రులు ఈ నెల 6న గుండ్లపల్లి గ్రామ శివారులోని మైసమ్మ గుడి వద్ద శివ్వంపేట మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన సాటి రమేశ్ తో పెళ్లి జరిపించారు.
ఈక్రమంలో శనివారం జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి శంకర్ గౌడ్ కు సమాచారం అందడంతో గుండ్లపల్లి గ్రామానికి వెళ్లి బాలికను మెదక్ పట్టణంలోని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. సాటి రమేశ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మైనర్ ను రెండో వివాహం చేసుకున్నాడని అధికారులు తెలిపారు. మైనర్ నుపెళ్లి చేసుకున్న రమేశ్తో పాటు పెళ్లి జరిపించిన పెద్దలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.